రెమ్డెసివిర్పై శివసేన వర్సెస్ బీజేపీ
ABN , First Publish Date - 2021-04-18T20:25:09+05:30 IST
రెమిడేసివిర్ పంపిణీ విషయంలో బీజేపీ, శివసేన మధ్య పరస్పరం మాటల యుద్ధం నడిచింది. మహారాష్ట్రకు
ముంబై : రెమిడేసివిర్ పంపిణీ విషయంలో బీజేపీ, శివసేన మధ్య పరస్పరం మాటల యుద్ధం నడిచింది. మహారాష్ట్రకు రెమిడేసివిర్ను పంపిణీ చేయవద్దని సరఫరాదారులపై కేంద్రం ఒత్తిడి తెస్తోందని శివసేన ఆరోపించింది. అయితే దీనిపై శివసేన కౌంటర్ ఇచ్చింది. ఓ సప్లైయర్ బీజేపీ నేతను కలిశారని, ఆ సప్లైయర్ను శివసేన వేధిస్తోందని బీజేపీ ఆరోపించింది. అంతేకాకుండా కొందరు మంత్రులకు ప్రజల ఆరోగ్యాలు ఏమాత్రం పట్టడం లేదని, కేవలం రాజకీయాలు చేస్తున్నారని ఫడణ్వీస్ పరోక్షంగా మంత్రి నవాబ్ మాలిక్ పై విరుచుకుపడ్డారు.
అసలు ఏం జరిగిందంటే...
బ్రుక్ ఫార్మా కంపెనీ అధినేత రాజేశ్ డొకానియాను పోలీసులు ఈ నెల 17 న అదుపులోకి తీసుకున్నారు. రెమిడేసివిర్ నిల్వలు అధికంగా ఉన్నాయన్న అనుమానం రావడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని, ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్వీస్ అనుచరులతో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి, ఆయన్ను వెంటనే విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో శివసేన లేనిపోని రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. నాలుగు రోజుల క్రితం రెమిడేసివిర్ సరఫరా చేయాలని బ్రూక్ ఫార్మాను అభ్యర్థించామని వెల్లడించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దీంతో తాను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్యాతో కూడా మాట్లాడానని, ఆ తర్వాత ఎఫ్డీఏ నుంచి కూడా అనుమతి పొందామని ఫడణ్వీస్ వెల్లడించారు. అయితే ప్రభుత్వంలోని ఓ ప్రత్యేక అధికారి బ్రుక్ ఫార్మా డైరెక్టర్ను పిలిచి మాట్లాడారని, ‘‘ఓ విపక్ష నేత అభ్యర్థిస్తే ఎలా రెమిడేసివిర్ను ఎలా సప్లై చేస్తారు?’’ అని ప్రశ్నించారని తెలిపారు. అంతేకాకుండా ఆ ఫార్మా అధికారిని రాత్రి 10 గంటలకు ఎలా అరెస్ట్ చేస్తారని ఫడణ్వీస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.