బ్లాక్‌లో రెమ్‌డెసివిర్‌ విక్రయాలు

ABN , First Publish Date - 2021-04-21T09:22:52+05:30 IST

కరోనా నియంత్రణకు కీలకమైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠా గుట్టును విజిలెన్స్‌ అధికారులు రట్టు చేశారు. రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి రాజేశ్వరరెడ్డి నెల్లూరులోని విజిలెన్స్‌ కార్యాలయంలో మంగళవారం రాత్రి ఈ వివరాలను విలేకరులకు వెల్లడించారు.

బ్లాక్‌లో రెమ్‌డెసివిర్‌ విక్రయాలు

  • -గుట్టు రట్టు చేసిన విజిలెన్స్‌

నెల్లూరు(క్రైం), ఏప్రిల్‌ 20: కరోనా నియంత్రణకు కీలకమైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠా గుట్టును విజిలెన్స్‌ అధికారులు రట్టు చేశారు. రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి రాజేశ్వరరెడ్డి నెల్లూరులోని విజిలెన్స్‌ కార్యాలయంలో మంగళవారం రాత్రి ఈ వివరాలను విలేకరులకు వెల్లడించారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ధరను రాష్ట్ర ప్రభుత్వం రూ.3,490గా నిర్ణయించింది. నెల్లూరు నగరం శివాజీనగర్‌కు చెందిన రామకృష్ణ.. తనకు పరిచయం ఉన్న ఆసుపత్రుల్లోని ల్యాబ్‌ల్లో సిబ్బంది ద్వారా ఇంజక్షన్‌ సేకరించారు. ఒక్కో ఇంజక్షన్‌ను పది రెట్లు అధిక ధరకు విక్రయిస్తున్నారని, ఇచ్చిన వ్యక్తులకు వాటాలిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌రెడ్డి, డీసీటీవో విఘ్ణురావు తమ సిబ్బందితో కలిసి మంగళవారం డెకాయి ఆపరేషన్‌ నిర్వహించారు. కొవిడ్‌ బాధితులుగా ఫోన్‌ చేసి ఇంజక్షన్‌ కావాలని రామకృష్ణను కోరారు. ఆయన రూ.40 వేలు చెప్పగా, రూ.25 వేలు చొప్పున 18 ఇంజక్షన్లు కావాలని రూ.4.50 లక్షలు చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. బృందావనంలోని ఓ ప్రైవేటు వైద్యశాల వద్ద ఇంజక్షన్లు ఇస్తానని రామకృష్ణ చె ప్పడంతో అక్కడకు చేరుకున్న అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. కరోనా చికిత్స అందిస్తున్న ఓ వైద్యశాల ల్యాబ్‌లో పని చేస్తున్న ఒంగోలుకు చెందిన షరీఫ్‌ ఆ ఇంజక్షన్లు ఇచ్చినట్లు వెల్లడించాడు. అధికారులు అక్కడికి వెళ్లగా అప్పటికే షరీఫ్‌ పరారయ్యాడు. ఆ వైద్యశాల డ్రగ్‌ఇన్‌స్పెక్టర్‌తో నిల్వను పరిశీలిస్తున్నామని, కేసును తదుపరి విచారణ నిమిత్తం సంతపేట పోలీసులకు అప్పగించనున్నట్లు రాజేశ్వరరెడ్డి తెలిపారు.

Updated Date - 2021-04-21T09:22:52+05:30 IST