‘నాచగిరి’ కమాన్ తొలగింపు
ABN , First Publish Date - 2022-01-18T04:53:51+05:30 IST
పోతరాజుపల్లికే ‘ఐకాన్’గా నిలిచిన నాచగిరి (నాచారంగుట్ట) కమాన్ను సోమవారం తొలగించారు. ఐదున్నర దశాబ్దాలు గల నాచారం కమాన్ చరిత్ర పుటల్లో కలిసిపోయింది.
పలుమార్లు ప్రమాదంతో దెబ్బతిన్న కమాన్
తూప్రాన్, జనవరి 17 : పోతరాజుపల్లికే ‘ఐకాన్’గా నిలిచిన నాచగిరి (నాచారంగుట్ట) కమాన్ను సోమవారం తొలగించారు. ఐదున్నర దశాబ్దాలు గల నాచారం కమాన్ చరిత్ర పుటల్లో కలిసిపోయింది. పోతరాజుపల్లి వద్దగల కమాన్కు పలుమార్లు ప్రమాదాలు జరిగి శిథిలమైంది. దీంతో దాన్ని తొలగించి మరో కమాన్ను నిర్మించేందుకు నిర్ణయించారు. నాచారంగుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామి ప్రథమ వైకుంఠద్వారంగా పోతరాజుపల్లి కమాన్కు పేరున్నది. 1967 ఏప్రిల్ 10న నర్సాపూర్ తాలూకా కొత్తపేటకు చెందిన మన్నె తులిశనాయుడు కుటుంబీకులు కమాన్ను నిర్మించారు. సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలతోపాటు సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మార్గంగా పోతరాజుపల్లి కమాన్ నిర్మించారు. ఇప్పటికీ హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చే భక్తులు పోతరాజుపల్లి కమాన్ వద్దనే దిగి నాచారంగుట్టకు చేరుకుంటారు. విజయవాడ-ముంబయి రహదారులకు అనుసంధానంగా చౌటుప్పల్ నుంచి సంగారెడ్డికి భారీ వాహనాలు ఈ మార్గం గుండానే వెళ్తుంటాయి. భారీ వాహనాలు వెళ్లే క్రమంలో కమాన్కు పలుమార్లు ప్రమాదం జరిగింది. ఇటీవలనే మరోసారి ఓ లారీ తగలడంతో కమాన్ భారీగా దెబ్బతిని ఓ వైపునకు ఒరిగిపోయింది. దాంతో నాచారం దేవస్థాన ట్రస్ట్ చైర్మన్ హన్మంతరావు పోతరాజుపల్లి కమాన్ను తొలగించేందుకు నిర్ణయించారు. గతంలో కమాన్ నిర్మాణం చేసిన మన్నె తులిశనాయుడు కుటుంబానికి చెందిన అశోక్కుమార్ మళ్లీ నిర్మాణం చేసేందుకు ముందుకొచ్చారు. వారి కుటుంబీకులు వివిధ ఆలయాల వద్ద 8 కమాన్లను నిర్మాణం చేయగా, ప్రస్తుతం రెండు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కమాన్ పునర్నిర్మాణం కోసం రూ.25 లక్షలు అందజేస్తానని ముందుకొచ్చినట్లు సమాచారం. దీంతో ప్రమాదాలతో దెబ్బతిన్న పోతరాజుపల్లి కమాన్ను కూల్చివేసే పనులు చేపట్టారు. ఇందులో రెండు భారీ క్రేన్లు, ఓ ఎక్స్కవేటర్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. కమాన్ కూల్చివేత సందర్భంగా గజ్వేల్ మార్గంలో వాహనాలు, బస్సుల దారి మళ్లింపు చేపట్టారు.