ఆ మంత్రిని తొలగించాలి.. రాష్ట్రపతికి కిసాన్ మోర్చా లేఖ
ABN , First Publish Date - 2021-10-04T21:30:42+05:30 IST
త్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతులను దారుణంగా పొట్టన పెట్టుకున్న ఘటనకు సంబంధించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతులను దారుణంగా పొట్టన పెట్టుకున్న ఘటనకు సంబంధించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) డిమాండ్ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని కోరింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఎస్కేఎం సోమవారం ఉదయం లేఖ రాసింది. రాజ్యాంగ పదవిలో ఉంటూ హింసను ప్రోత్సహించిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ను సైతం ఆ పదవి నుంచి తొలగించాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది.
''హింసను ప్రోత్సహిస్తూ, విద్వేష వ్యాప్తికి పాల్పడుతున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తక్షణం కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలి. అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా, ఆయన అనుచర గూండాలను సెక్షన్ 302 (హత్యానేరం) కింద తక్షణం అరెస్టు చేయాలి'' అని ఆ లేఖలో ఎస్కేఎం పేర్కొంది. పట్టపగలే రైతులపై వాహనాలు నడిపి అత్యంత అమానుషంగా చంపిన ఘటనపై యావద్దేశం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోందని కూడా తెలిపింది. ఉత్తరప్రదేశ్, కేంద్ర ప్రభుత్వ లోతైన కుట్రలే ఈ తరహా దాడుల కారణమని ఆరోపించింది. పార్టీ కార్యకర్తలు లాఠీలు తీసుకుని రైతులకు విరుచుకుపడాలంటూ పార్టీ కార్యకర్తలను హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ బహిరంగంగా రెచ్చగొట్టిన రోజే ఈ ఘటన జరిగిందని, ఇది ఎంతమాత్ర యాదృచ్ఛికం కాదని రాష్ట్రపతికి రాసిన లేఖలో ఎస్కేఎం తెలిపింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు తమ పదవులను వ్యూహాత్మకంగా హింసను రెచ్చగొట్టేందుకు వాడుకుంటున్నారని, ఇది దేశ చట్టాలపరంగా నేరమని, రాజ్యాంగం, దేశానికి వ్యతిరేకమని పేర్కొంది. కాగా, ఆదివారం జరిగిన లఖింపూర్ హింసాత్మక ఘటనలో మృతుల సంఖ్య సోమవారంనాడు తొమ్మిది మందికి పెరిగింది.