చట్టం రద్దు చేయండి

ABN , First Publish Date - 2021-10-23T07:56:37+05:30 IST

దేశవ్యాప్తంగా రాష్ట్రాల, జిల్లాల స్థాయిలో వినియోగదారుల కమిషన్‌ నియామకాలు ఆలస్యం కావడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి...

చట్టం రద్దు చేయండి

నియామకాలు వద్దనుకుంటే వినియోగదారుల 

మౌలిక వసతుల్లేకుండా న్యాయమెలా?: సుప్రీం

న్యూఢిల్లీ, అక్టోబరు 22: దేశవ్యాప్తంగా రాష్ట్రాల, జిల్లాల స్థాయిలో వినియోగదారుల కమిషన్‌ నియామకాలు ఆలస్యం కావడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రైబ్యునళ్లు వద్దని ప్రభు త్వం భావిస్తే ఏకంగా వినియోగదారుల హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని వ్యాఖ్యానించింది. జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ అంశాన్ని విచారించింది. ట్రైబ్యునళ్ల ఖాళీలను భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు తన అధికార పరిధిని విస్తరించి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి రావడంపై ఆవేదన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వినియోగదారుల కమిషన్ల నియామకాలు చేపట్టడం లేదని, ఆ వేదికలకు మౌలిక సదుపాయాలను సమకూర్చడం లేదని గమనించిన సర్వోన్నత న్యాయస్థానం స్వయంగా ఈ అం శంపై విచారణ చేపట్టింది. వినియోగదారుల చట్టంలో కొన్ని సెక్షన్లను బాంబే హైకోర్టు కొట్టేసినప్పటికీ నియామకాలకు ఆ తీర్పు అడ్డం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


వారం రోజుల్లో అన్ని రాష్ట్రాలు నియామకాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇవ్వలేకపోతే సంబంధిత శాఖ కార్యదర్శి సుప్రీంకోర్టు విచారణకు రావాల్సి ఉంటుందని హెచ్చరించింది. న్యాయస్థానాల్లాగే వినియోదారుల వేదికకు కూడా శాశ్వత ప్రాతిపదిక ఉండాలని, న్యాయవ్యవస్థే వాటి నియామకాలను చేపట్టాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను వినియోగదారుల కమిషన్‌కు నియమించడం కూడా సరికాదని జస్టిస్‌ సుందరేశన్‌ అన్నారు. వారి నుంచి జవాబుదారీతనాన్ని ఆశించలేమని వ్యాఖ్యానించారు. శాశ్వత ప్రాతిపదికన జడ్జిలు వద్దనుకుంటే ఐదేళ్ల కాల వ్యవధిలో కూడా నియామకాలు చేపట్టవచ్చని సూచించారు. 

Updated Date - 2021-10-23T07:56:37+05:30 IST