ప్రధాని ప్రకటనతో బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూరదు: సుప్రీం ప్యానల్ సభ్యుడు

ABN , First Publish Date - 2021-11-19T21:52:53+05:30 IST

వివాదాస్పద సాగుచట్టాలను రద్దు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు నియమించిన ప్యానల్‌లోని ..

ప్రధాని ప్రకటనతో బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూరదు: సుప్రీం ప్యానల్ సభ్యుడు

న్యూఢిల్లీ: వివాదాస్పద సాగుచట్టాలను రద్దు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు నియమించిన ప్యానల్‌లోని కీలక సభ్యుడొకరు పెదవి విరిచారు. ఇది రాజకీయ నిర్ణయమైనందున రైతుల ఆందోళన ముగిసినట్టు కాదని, రానున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి ప్రయోజనం చేకూరదని ప్యానల్ సభ్యుడు, షెట్కారి సంఘటన అధ్యక్షుడు అనిల్ జే ఘన్వత్ తెలిపారు. రాబోయే అసెంబ్లీ  ఎన్నికల వరకూ నిరసనకారులు తమ ఆందోళన కొనసాగించే ఆలోచనతో ఉన్నారని చెప్పారు. నిజానికి, పార్లమెంటులో సరైన చర్చ జరిగి ఉన్నా, పార్లమెంటరీ ప్యానల్ వేసేందుకు కేంద్రం ఒప్పుకున్నా ఈ చట్టాలు నిలబడేవని అన్నారు. నిరసనలు తారాస్థాయికి చేరుకున్నప్పుడు కూడా ఖాతరు చేయని కేంద్రం ఇప్పుడు దిగివచ్చిందని పేర్కొన్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు భరోసా ఇస్తూ చట్టం చేయాలనే తమ డిమాండ్ ఇప్పటికీ అలాగే ఉందని, సాగు చట్టాల రద్దు నిర్ణయం వల్ల బీజేపీకి రాజకీయంగా ఒరిగేదేమీ  ఉండదని ఆయన పేర్కొన్నారు.


''ఇది చాలా దురదృష్టకర నిర్ణయం. రైతులకు స్వేచ్ఛ ఉండాలి. కానీ, ఇండిపెండెన్స్ నుంచి వారిని మోసగిస్తూనే ఉన్నారు'' అని ఘన్వత్ అన్నారు. ఎక్కడైనా తమ ఉత్పత్తులను అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు ఇచ్చినప్పటికీ, ఎగుమతుల బ్యాన్, స్టాక్ పరిమితులు వంటి ఆంక్షలు పెడుతున్నారని, దీంతో రైతులు తమ ఉత్పత్తులను గత్యంతరం లేని పరిస్థితుల్లో తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని, ఆ రకంగానూ రైతులు మోసపోతున్నారని అన్నారు. రైతుల ఒత్తిడికి కేంద్రం తలొగ్గినట్టు కనిపిస్తున్నా ప్రస్తుతానికైతే రైతులకు ఇప్పటికీ మంచి జరుగుతుందనే ఆశలైతే లేవని పేర్కొన్నారు.

Updated Date - 2021-11-19T21:52:53+05:30 IST