రిపబ్లిక్‌ డే సమీపిస్తోంది.. ట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నాయి!

ABN , First Publish Date - 2021-11-29T08:34:27+05:30 IST

త్వరలోనే గణతంత్ర దినోత్సవం వస్తోందని, వేలాది ట్రాక్టర్లు ఢిల్లీలో వేచి చూస్తున్నాయని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ)...

రిపబ్లిక్‌ డే సమీపిస్తోంది.. ట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నాయి!

 బీకేయూ నేత తికాయత్‌ హెచ్చరిక

ముంబై, నవంబరు 28: త్వరలోనే గణతంత్ర దినోత్సవం వస్తోందని, వేలాది ట్రాక్టర్లు ఢిల్లీలో వేచి చూస్తున్నాయని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్‌ తికాయత్‌ కేంద్ర ప్రభుత్వాన్ని తాజాగా హెచ్చరించారు. గత ఏడాది జనవరి 26న రైతులు నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనను గుర్తుచేసేలా తికాయత్‌ తాజాగా వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని ఆజాద్‌ మైదాన్‌లో జరిగిన ‘కిసాన్‌ మహాపంచాయత్‌’ కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వం సంప్రదింపులకు వచ్చే వరకూ తమ నిరసనలు కొనసాగుతాయని విలేకరులకు స్పష్టం చేశారు. ‘‘రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎంఎ్‌సపీపై దేశవ్యాప్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి. ఈ సమస్య నుంచి పారిపోయేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. రైతు చట్టాల నిరసనల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు కేంద్రం ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలి. ప్రభుత్వం మమ్మల్ని ఖలిస్థానీలు, నక్సలైట్లు అని పిలుస్తోంది. నిరసనకారులను ఉగ్రవాదులంటోంది. అయినా మా ఐక్యత చెక్కుచెదరదు. మా సమావేశాల్ని చెదరగొట్టాలనుకుంటే.. మేము మీ సమావేశాలకు అదే గతి పట్టిస్తాం. మేము చర్చించాలనుకుంటున్నాం కానీ భిక్షం అడగడం లేదు. మా పోరాటం ఆగదు’’ అని తికాయత్‌ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-11-29T08:34:27+05:30 IST