తాళం వేసుకుని రెండేళ్లుగా ఇంట్లోనే బందీ.. స్నానం కూడా బంద్.. ఈ కఠిన నిర్ణయానికి కారణమేంటంటే..
ABN , First Publish Date - 2021-07-29T17:46:35+05:30 IST
అతడు రెండేళ్లుగా ఇంట్లోనే బందీగా ఉండిపోయాడు.. చీకటితోనే స్నేహం చేశాడు..
అతడు రెండేళ్లుగా ఇంట్లోనే బందీగా ఉండిపోయాడు.. చీకటితోనే స్నేహం చేశాడు.. రెండేళ్లుగా స్నానం చేయలేదు.. బట్టలు మార్చుకోలేదు.. బయటి నుంచి ఎవరైనా ఆహారం తెస్తే తిన్నాడు.. లేకపోతే లేదు.. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న సామాజిక సంస్థల ప్రతినిధులు, పోలీసులు ఎట్టకేలకు అతణ్ని బయటకు తీసుకొచ్చారు. ఇంతకీ అతను తీసుకున్న ఈ కఠిన నిర్ణయానికి కారణమేంటి?
హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన సంజీవ్ సెహగల్ తన తలిదండ్రుల మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఇంట్లో ఒంటరిగానే ఎక్కువ సమయం గడిపేవాడు. సోదరుడు, సోదరి చెప్పినా కూడా వినేవాడు కాదు. రెండేళ్ల క్రితం ఇంటికి తాళం వేసుకుని పూర్తిగా బయటకు రావడం మానేశాడు. అప్పట్నుంచి స్నానం చేయలేదు. వేసుకున్న బట్టలు మార్చుకోలేదు. ఇరుగుపొరుగ వారు ఎవరైనా భోజనం తెస్తే తినేవాడు. లేకపోతే పస్తులు ఉండేవాడు.
సోదరి, సోదరుడు కూడా సంజీవ్ గురించి పట్టించుకోవడం మానేశారు. అయితే ఇరుగుపొరుగు వారు తాజాగా సంజీవ్ గురించి పోలీసులకు, సామాజిక సంస్థలకు సమాచారం అందించారు. అక్కడకు చేరకున్న సామాజిక సంస్థ ప్రతినిధులు ఎంతో కష్టపడి సంజీవ్ను బయటకు తీసుకొచ్చారు. ఇంటి నిండా బూజు, నాచు, ఎలుకలు ఉన్నాయని, సంజీవ్ ఆ ఇంట్లో దుర్భర జీవితం గడుపుతున్నాడని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సంజీవ్ను ముందుగా ఆశ్రమానికి తీసుకెళ్లి స్నానం చేయించి, బట్టలు మార్చుతామని, అనంతరం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తామని తెలిపారు.