అధికారుల తీరుపై నిర్వాసితుల ఆగ్రహం
ABN , First Publish Date - 2022-06-04T06:41:51+05:30 IST
బోయినపల్లి మండలం వర్ధవెల్లి రెవెన్యూ శివారులో అదనపు టీఎంసీ భూ సర్వేలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహించిన నిర్వాసితులు శుక్రవారం పనులను అడ్డుకు న్నారు.
- అదనపు టీఎంసీ పనుల అడ్డగింత
బోయినపల్లి, జూన్ 3: బోయినపల్లి మండలం వర్ధవెల్లి రెవెన్యూ శివారులో అదనపు టీఎంసీ భూ సర్వేలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహించిన నిర్వాసితులు శుక్రవారం పనులను అడ్డుకు న్నారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ తరలింపులో బోయినపల్లి మండలంలోని విలాసాగర్ రెవెన్యూ పరిధిలో 165.15ఎకాలు, వర్ధవెల్లి రెవెన్యూ పరిధిలో 20.38 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. రైతుల పాస్బుక్లో ఉన్న భూముల వివరాలు, వారు సాగు చేసుకుంటున్న వివరాలను పక్కనపెట్టి అధికారులు ఇష్టారాజ్యంగా పరిహారం ఖరారు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రత్నంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులకు చెక్కులను పంపిణీ చేసేందుకు జాబితాను రూపొందించారు. అధికారులు రూపొందించిన జాబితాలో కొదరు రైతుల భూమి తక్కువగా నమోదు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వర్ధవెల్లి శివారులో జరుగుతున్న పనుల వద్దకు వెళ్లి అడ్డుకున్నారు. రికార్డులో ఉన్న భూమితోపాటు, వ్యవసాయ బావులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్లు స్పందించాలని కోరారు. అప్పటి వరకు పనులు చేపట్టవద్దని కాంట్రాక్ట్ సిబ్బందిని హెచ్చరించారు.