రెచ్చిపోతున్నరేషన్ మాఫియా
ABN , First Publish Date - 2021-10-23T05:15:35+05:30 IST
నరసరావుపేట కేంద్రంగా రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రతి నెలా ఇక్కడినుంచి వేలాది బస్తాల రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిపోతోంది.
అధికార పార్టీ అండదండలతోనే నరసరావుపేటలో అక్రమ వ్యాపారం?
పెద్దఎత్తున నెలవారీ మామూళ్లు
సచాచారం ఇచ్చినా స్పందించని స్థానిక యంత్రాంగం
నరసరావుపేట, అక్టోబరు 22: నరసరావుపేట కేంద్రంగా రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రతి నెలా ఇక్కడినుంచి వేలాది బస్తాల రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిపోతోంది. అధికారుల కళ్లకు మామూళ్ల గంతలు కట్టి అక్రమార్కులు యథేచ్ఛగా వారి వ్యాపారం నిర్వహిస్తున్నారు. నెలకు లక్షల్లో ముడుపులు చేతులు మారుతున్నట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది. నరసరావుపేట కేంద్రంగా జరుగుతున్న రేషన్ బ్లాక్మార్కెట్పై ఆంధ్రజ్యోతిలో ఇటీ వల వార్తాకథనం వెలువడింది. దీనిపై స్పందించి చర్యలు తీసు కోవాల్సిన అధికారులు మిన్నకుండటం మాట అటుంచి మీకు సమాచారం ఎక్కడిది..? వివరాలు తెలియజేయాలని పోలీసు శాఖలోని అధికారులు కోరడం గమనార్హం. మా వద్ద సమాచారం ఉంది. అక్రమ బియ్యం నిల్వలు రావిపాడు, ఉప్పల పాడు రోడ్డులోని రెండు మిల్లుల్లో ఉన్నాయి మీరు స్వాఽధీనం చేసుకుం టారా? అని ఆంధ్రజ్యోతి విలేకరులు సదరు పోలీసు అధికారులను ప్రశ్నిస్తే వారు మౌనంగా ఉండడం.. ఇక్కడి అక్రమ వ్యాపారానికి అధికారుల అం డదండలు ఏ మేరకు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. అదే మిల్లులో ఇప్పుడు 1,090 క్వింటాళ్ళ బియ్యం నిల్వలు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. అధికార పార్టీ నేతల అండదండలతోనే బియ్యం అక్రమ వ్యాపారం జరు గుతున్నట్టు పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నరసరావుపేటలోని రావిపాడు రోడ్డు, వినుకొండ రోడ్డులోని రెండు మిల్లుల కేంద్రంగా రేషన్ దందా సాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి డీలర్ల వద్ద రేషన్ బియ్యం సేకరించి ఈ కేంద్రా లకు తరలిస్తున్నారు. ఈ వ్యాపారం బహిరంగానే జరుగుతోంది. అయితే రావిపాడు రోడ్డులోని స్వప్న ట్రేడర్స్ పేరుతో నిర్వహిస్తున్న మిల్లులో గతంలో నాలుగువేల బస్తాలు, గురువారం 1090.50 కింటాళ్ల బియ్యం నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో అక్రమ నిల్వలకు సంబంధించిన కేసును నీరు గార్చారన్న విమర్శలు అధికారులపై వ్యక్తమయ్యాయి. ఈసారైనా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటారో గతంలో వలే వదిలేస్తారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక యంత్రాంగం ఒక్కసారి కూడా అక్రమ బియ్యం నిల్వలను స్వాధీనం పరచుకోలేదు. రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ఆదేశాలతో గత ఏడాది సెప్టెంబరులో, గురువారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో మాత్రమే అక్రమ బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిడిలు అఽధికంగా ఉండటం వలనే సమాచారం ఉన్నా రేషన్ బియ్యం స్వాధీనం చేసుకోవడంలేదన్న ప్రచారం జరుగుతోంది.
అక్రమార్కులపై చర్యలకు అనేక ఆధారాలు
రెండుసార్లు స్వప్ప ట్రేడర్స్ మిల్లులో స్వాధీనం చేసుకున్న బియ్యం నిల్వలకు సంబంధించి అనేక ఆధారాలు అధికారులు లభ్యమయ్యాయి. గతంలో బియ్యం స్వాధీ నం చేసుకున్న సందర్భంగా మొక్కుబడిగా కేసు నమోదు చేసి వదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. ఈసారి ఏం చేస్తారో చూడాలి. ధాన్యం లేకుండానే వేలాది బస్తాల బియ్యం ఉత్పత్తి చేయడంలో అక్రమార్కులు ఆరితేరారు. డీలర్ల వద్ద బియ్యం సేకరించి పాలిష్ వేసి ప్యాకింగ్ చేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. గురువారం జరిగిన తనిఖీల సందర్భంగా ధాన్యం లేకుండానే బియ్యం నిల్వలు మిల్లులో ఉన్నాయని, నిల్వలకు సం బంధించి తవుడు, వరిపొట్టు లేదని, కరెంటు బిల్లు నామ మాత్రంగానే ఉందని, ఈ నిల్వలు కచ్ఛితంగా రేషన్ బియ్యమేనని ఫౌరసరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. ఈమేరకు ఉన్నతాధికారులకు నివేదికలు అంద జేసినట్లు తెలిసింది. బియ్యం నిల్వలకు సంబంధించి స్వప్నట్రేడర్స్ మిల్లు నిర్వాహకులు ఆవుల శివారెడ్డి, బత్తుల బాలయ్య, లారీడ్రైవర్ వి.భూపాల్, బి.కిషోర్బాబులపై రూరల్ పోలీసు స్టేషన్లో తాను ఇచ్చిన రిపోర్టు మేరకు కేసు నమోదైందని తహసీల్దార్ రమణా నాయక్ శుక్రవారం తెలిపారు. పీడీఎస్ బ్యాగ్లలో ఉన్న 450 బస్తాల బియ్యం నిల్వలను ఎంఎల్ఎస్ పా యింట్కు అప్పగించామన్నారు. మిగ తా నిల్వలు వినుకొండ రోడ్డులోని కా మధేను రైస్ మిల్లు నిర్వాహకులు కస్టోడియన్గా ఉన్నారని తెలిపారు.