భారత్ నుంచి వచ్చేవారిపై అమెరికా ఆంక్షలు
ABN , First Publish Date - 2021-05-05T08:17:35+05:30 IST
భారత్ నుంచి వచ్చే వారిపై ప్రయాణ నిషేధం విధించిన దేశాల జాబితాలో అమెరికా కూడా చేరింది. ఇప్పటికే న్యూజిలాండ్, యూకే తదితర దేశాలు ఈ నిషేధం విధించిన...
- టీకా వేయించుకోనివారిపై కువైత్ నిషేధం
వాషింగ్టన్, మే4: భారత్ నుంచి వచ్చే వారిపై ప్రయాణ నిషేధం విధించిన దేశాల జాబితాలో అమెరికా కూడా చేరింది. ఇప్పటికే న్యూజిలాండ్, యూకే తదితర దేశాలు ఈ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇండియాలో కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి అమల్లోకి వచ్చేలా నిరవధిక ప్రయాణ నిషేధాన్ని విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అయితే.. కొన్ని కేటగిరీల విద్యార్థులకు, పా త్రికేయులకు, కరోనాపై పోరులో భాగంగా వివిధ దేశాలకు మౌలిక సదుపాయాలను అందించే వ్యక్తులకు కూడా ఈ నిషేధం నుంచి మినహాయింపు ఉంటుంది. గ్రీన్కార్డులున్నవారు, వారి జీవితభాగస్వాములు, 21 ఏళ్లలోపు పిల్లలు ఈ కేటగిరీల్లోకి వస్తారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ ఈ ఆం క్షలు అమల్లో ఉంటాయి. గడిచిన 14 రోజుల్లో భారత్లో ఉన్న అమెరికనేతర పౌరులకు, వలసదారులు కానివారికి ఈ ఆంక్షలు వర్తిస్తాయని బైడెన్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సలహా మేరకు బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా.. కువైత్ కూడా తమ దేశానికి విదేశీయుల రాకపై ఆంక్షలు విధించింది. టీకా తీసుకున్నవారు వస్తే ఓకేగానీ.. టీకా తీసుకోనివారిని రానివ్వబోమని ప్రకటించింది. మే 22 దాకా ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తమవడంతో ఒకడోసు తీసుక్ను వారికి మాత్రం మినహాయింపు ఉంటుందని వెల్లడించింది.