ఢిల్లీలో మోదీ, గల్లీలో కేడీ దోచుకుంటున్నారు: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2021-06-11T23:40:39+05:30 IST
నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదల నడ్డి విరుస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు.
హైదరాబాద్: నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదల నడ్డి విరుస్తున్నాయని కాంగ్రెస్ మల్కాజ్గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ పెట్రో రేట్లు పెంచుతూ పేదలను నిలువు దోపిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంతో ఏడాది నుంచి లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని చెప్పారు. 10 నెలల కాలంలో పెట్రోల్పై రూ.25, డీజిల్పై 26 పెంచారని రేవంత్రెడ్డి మండిపడ్డారు.
కరోనా సంక్షోభంలో పేదలను ఆదుకోవాల్సింది పోయి దోచుకుంటున్నారన్నారు. ఢిల్లీలో మోదీ, గల్లీలో కేడీ ఇద్దరు కలిసి లీటర్ 35 రూపాయలకు రావాల్సిన పెట్రోల్ నూరు రూపాయలకు అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. ఇందులో రూ.33 మోదీ, రూ.32 కేసీఆర్ పన్నుల పేరిట వసూలు చేస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ ధర పెరిగితే ఆ ప్రభావం రవాణా రంగంపై ఉంటుందన్నారు. మోదీ ఏడేళ్ల పాలనలో అచ్చేదిన్ రాలేదు... సచ్చేదిన్ వచ్చిందని ఎద్దేవా చేశారు. పెట్రో ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.