మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు

ABN , First Publish Date - 2021-11-16T23:15:11+05:30 IST

సీఎం కేసీఆర్, ప్రభుత్వంపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్నవెంకట్రామిరెడ్డితో...

మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు

హైదరాబాద్: సీఎం కేసీఆర్, ప్రభుత్వంపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్నవెంకట్రామిరెడ్డితో రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికారిగా ఉన్నప్పుడు వెంకట్రామి‌రెడ్డి వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వెంకట్రామిరెడ్డి రాజీనామానాను ఆమోదించడానికి వీల్లేదన్నారు. వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్‌ను తిరస్కరించి, చట్టమైన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 



దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్‌కు వెంకట్రామిరెడ్డి బంట్రోతుగా పని చేశారని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డును అష్టవంకరలు తిప్పడం వెనుక వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. విచారణ నుంచి అప్పట్లో వెంకట్రామిరెడ్డి తప్పించుకున్నారని తెలిపారు. వెంకట్రామిరెడ్డిని కేసీఆర్ ఆఘమేఘాల మీద ఎమ్మెల్సీని చేస్తున్నారని విమర్శించారు. అందరి ముఖ్యమంత్రులను బుట్టలో వేసుకున్న ఘనుడు వెంకట్రామిరెడ్డి అని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలోని సీఎంలకు అత్యంత ప్రీతిపాత్రుడైన వెంకట్రామిరెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్‌గా కేసీఆర్ నియమించారని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎంలకు వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడం వంటి నైపుణ్యం వెంక్రటామిరెడ్డిలో ఉందన్నారు. వెంకట్రామిరెడ్డిని కేసీఆర్ దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాధ్యతలు ఇచ్చారని తెలిపారు. దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వివరాలు దొరకడంలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వెంక్రటామిరెడ్డిపై జరిమానా విధించారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. 

Updated Date - 2021-11-16T23:15:11+05:30 IST