రివర్స్ పీఆర్సీని అంగీకరించేది లేదు
ABN , First Publish Date - 2022-01-29T05:06:23+05:30 IST
రివర్స్ పీఆర్సీని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.
రెండో రోజు దీక్షలో ఉద్యోగ సంఘాలు
కర్నూలు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): రివర్స్ పీఆర్సీని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం నంద్యాల డివిజన్కు చెందిన వివిధ శాఖల ఉద్యోగులు దాదాపు 250 మంది పాల్గొన్నారు. ఏపీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరిరెడ్డి, ఏపీజేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ హృదయరాజు వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్సీని తాము ఒప్పుకోకపోయినా బలవంతంగా ఉద్యోగులపై ప్రభుత్వం రుద్దాలని చూస్తోందన్నారు. పాత జీతాలనే తమకు అందించాలన్నారు. కొత్త పీఆర్సీతో కూడిన జీతాలపై ప్రొసీడింగ్స్ ఇవ్వాలంటూ డీడీలపై ఒత్తిడి తీసుకువస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఏపీజేఏసీ, ఏపీజీఈఏ, ఉపాధ్యాయ సంఘాలు, డ్రైవర్స్ అసోసియేషన్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.