ఉన్నత విద్యకు ప్రాధాన్యం
ABN , First Publish Date - 2022-04-30T08:56:24+05:30 IST
ఉన్నత విద్యకు ప్రాధాన్యం
చదివే వారి శాతం పెరగాలి
బోధన సిబ్బంది భర్తీకి ఆమోదం
ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష
అమరావతి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యను అభ్యసించేవారి సంఖ్య పెరగాలని సీఎం జగన్ నిర్దేశించారు. కళాశాలల్లో బోధన సిబ్బంది భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపారు. బోధన సిబ్బందిలో ఎక్కడ ఖాళీలున్నా వెంటనే భర్తీచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జేఎన్టీయూ తరహాలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఒక ప్రత్యేక యూనివర్సిటీ కిందకు తీసుకురావాలని సూచించారు. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్ ఉన్నత విద్యపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ను విద్యాదీవెన కింద అమలుచేస్తున్నామని చెప్పారు. గతంలో కంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరిగిందని.. అయితే దీన్ని 80శాతానికి తీసుకెళ్లాలని సూచించారు. కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని అమ్మాయిలు చదువుకు దూరం అవుతున్నారని, ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న దాదాపు 30 నైపుణ్య కళాశాలల్లో ఇంటర్న్షిప్ కోసం ఏర్పాట్లు చేయాలన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్శర్మ తదితరులు పాల్గొన్నారు. కాగా, సమగ్రశిక్ష ప్రాజెక్టులోని అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ల ఆధ్వర్యంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందిని టెర్మినేట్ చేస్తూ ప్రాజెక్టు డైరక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. వీరిని ప్రతి ఏటా టెర్మినేట్ చేసి.. మళ్లీ వెంటనే నియామక ఉత్తర్వులు ఇస్తారు.