వందశాతం కోటా తీర్పును పునస్సమీక్షించాలి
ABN , First Publish Date - 2020-07-08T06:50:12+05:30 IST
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాల్లో 100 శాతం రిజర్వేషన్లు చెల్లవంటూ గతంలో ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలంటూ పలు జాతీయస్థాయి సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి...
- గిరిజన రిజర్వేషన్ల తీర్పుపై సుప్రీంలో రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాల్లో 100 శాతం రిజర్వేషన్లు చెల్లవంటూ గతంలో ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలంటూ పలు జాతీయస్థాయి సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. అఖిల భారత జనజాతి వికాస్ సంఘ్, అఖిల భారత ఎస్సీ,ఎస్టీల సంస్థల ఫెడరేషన్, బీఆర్ అంబేడ్కర్ విద్యాపీఠ్, సామాజిక కార్యకర్తలు ముకుల్ చౌదరి, హర్నం సింగ్ ఉమ్మడిగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో లోపాలున్నాయని, పూర్తి వివరాలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు తమ వ్యాజ్యంలో పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యతను పెంచేందుకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ఉమ్మడి ఏపీలో గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించిందని గుర్తు చేశారు. షెడ్యూల్ ఐదుకూ, ఆర్టికల్ 371డీకీ సంబంధం లేదని, ఒకదానికి ఒకటి అవరోధం కాబోదని స్పష్టం చేశారు. ఈ తీర్పు అగ్రవర్ణాలకు అనుకూలంగా ఉంటుందని ఆరోపించారు.