ఘాటెక్కిన ఉల్లి
ABN , First Publish Date - 2021-02-25T05:29:46+05:30 IST
ఉల్లి ధరలు ఘాటెక్కాయి. మొన్నటి వరకు సామాన్యులకు అందుబాటులో ఉన్న ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కిలోపై రూ.20కుపైగా పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. గత నెలలో కిలో ఉల్లి రూ.30 పలికేది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో రూ.55కు అమ్ముతున్నారు.
ఒక్కసారిగా పెరిగిన ధరలు
కిలో రూ.55 పలుకుతున్న వైనం
సామాన్యులు బెంబేలు
(టెక్కలి)
ఉల్లి ధరలు ఘాటెక్కాయి. మొన్నటి వరకు సామాన్యులకు అందుబాటులో ఉన్న ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కిలోపై రూ.20కుపైగా పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. గత నెలలో కిలో ఉల్లి రూ.30 పలికేది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో రూ.55కు అమ్ముతున్నారు. గడచిన యాభై రోజుల వ్యవధిలో కిలోపై రూ.25 పెరిగింది. జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు మహారాష్ట్ర నుంచి, ఏప్రిల్ తరువాత కర్ణాటకతో పాటు మన రాష్ట్రంలోని శంకరాపల్లి, సదాశివునిపేట, కర్నూలు, తదితర ప్రాంతాల నుంచి హోల్సేల్ వ్యాపారులు ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటుంటారు. జిల్లాకు జంటపాయి, పేడు ఉల్లి, గోల్టీ, గోల్టా, బల్లారి, మీడియం బల్లారి, తదితర రకాల ఉల్లి దిగుమతి అవుతుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో కిలో ఉల్లి రూ.33 నుంచి రూ.40 వరకు ధర పలుకుతోంది. రవాణా చార్జీలు, బస్తాల్లో ఉల్లి తరుగుదల, సంచుల ఖరీదు, కమీషన్ అన్ని కలుపు కొని హోల్సేల్ వ్యాపారులు కిలో ఉల్లిని 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. రిటైల్ వ్యాపారులు మరో ఐదు రూపాయలను కలుపుకొని కిలో రూ.55కు అమ్ముతున్నారు. మహారాష్ట్ర నుంచి జిల్లాకు ఉల్లిని రవాణా చేసుకొనేందుకు నాలుగు రోజులు సమయం పడుతుంది. కిలో ఉల్లిపాయల దిగుమతికి రూ.6 నుంచి రూ.7వరకు ఖర్చు అవుతుంది. దీంతో ధరలు ఒక్కసారిగా ఘాటెక్కాయి. పైగా ఆ రాష్ట్రంలో కరోనా కారణంగా ఉల్లి సాగు భారీగా తగ్గింది. అలాగే అకాల వర్షాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, వ్యాపారుల కృత్రిమ కొరత వెరసి ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
రోజుకు 10 లారీల సరుకు దిగుమతి
మహారాష్ట్ర నుంచి జిల్లాకు రోజుకు 10 లారీల ఉల్లి దిగుమతి అవుతోంది. రణస్థలం, శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, పాలకొండ, రాజాం, ఆమదాలవలస, తదితర ప్రధాన ప్రాంతాల్లోని హోల్సేల్ వ్యాపారులు వీటిని తెస్తున్నారు. ఒక్కో లారీకి 30 టన్నుల సరుకు వస్తుంది. ఈ లెక్కన రోజుకు 260 నుంచి 300 టన్నుల ఉల్లిని హోల్సేల్ వ్యాపారులు విక్రయిస్తున్నారు. కాగా, ఉల్లి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా కృత్రిమ కొరతపై నిఘా పెట్టడంతో పాటు ధరలను పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు.