ఆర్‌ఎల్‌డీ చీఫ్‌ అజిత్‌సింగ్‌ ఇక లేరు

ABN , First Publish Date - 2021-05-07T10:17:38+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్డీ) పార్టీ అధినేత చౌదరి అజిత్‌సింగ్‌(82) తుదిశ్వాస విడిచారు. గత నెల 20న కరోనా బారిన పడిన ఆయన.. గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు.

ఆర్‌ఎల్‌డీ చీఫ్‌ అజిత్‌సింగ్‌ ఇక లేరు

కొవిడ్‌తో 16 రోజుల పోరాటం


న్యూఢిల్లీ, హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్డీ) పార్టీ అధినేత చౌదరి అజిత్‌సింగ్‌(82) తుదిశ్వాస విడిచారు. గత నెల 20న కరోనా బారిన పడిన ఆయన.. గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయాన్ని అజిత్‌సింగ్‌ కుమారుడు జయంత్‌ చౌదరి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అజిత్‌సింగ్‌తో పాటు.. ఆయన మనవరాలికి కరోనా సోకినా ఆమె చికిత్సతో కోలుకున్నారు. అజిత్‌సింగ్‌ 1939 ఫిబ్రవరి 12న ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జన్మించారు. లఖ్‌నవూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్న ఆయన.. ఐఐటీ-ఖరగ్‌పూర్‌, అమెరికాలోని ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు.


కంప్యూటర్‌ సైంటిస్ట్‌గా 15 ఏళ్ల పాటు అమెరికాలో పనిచేశారు. తన తండ్రి, మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ మరణంతో 80లలో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. 1986లో రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఏడుసా ర్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1989లో నేషనల్‌ ఫ్రం ట్‌ సర్కారులో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత సంకీర్ణ(వాజపేయి, మన్మోహన్‌) ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా సేవలందించారు. చివరిసారి యూపీఏ-2 హయాంలో పౌర విమానయాన మంత్రిగా పనిచేశారు. ఏ శాఖను చూసినా.. రైతుల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ రైతు సమస్యలను పరిష్కరించారు.ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చిన తొలి జాతీయ నేత ఆయనే. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడంలోనూ ఆయనది కీలకపాత్ర.


తొలి నుంచి జాతీయ రాజకీయాల్లో..

అజిత్‌సింగ్‌ ఆది నుంచి జాతీయ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఉన్నారు. వీపీ సింగ్‌, ఎన్టీ రామారావు, చంద్రశేఖర్‌, రామకృష్ణ హెగ్డే, ఆడ్వాణీ, బహుగుణ, జ్యోతిబసు, రాంవిలాస్‌ పాసవాన్‌ తదితర హేమాహేమీలతో 1988లో ఏ ర్పాటైన కోర్‌గ్రూ్‌పలో అజిత్‌సింగ్‌ ఉన్నారు. సంకీర్ణ దశ ప్రా రంభం నుంచి ఆయన జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకవ్యక్తిగా పనిచేశారు. చంద్రశేఖర్‌ అనుయాయిగా పేరొందారు.


తొలిదశలోనే జనతాపార్టీకి అధ్యక్షుడయ్యారు. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత పీవీపై విమర్శలు గు ప్పించిన జాతీయ నేతల్లో అజిత్‌సింగ్‌ ఒకరు. ‘‘పీవీ ధోవ తి కింద ఆరెస్సెస్‌ నిక్కర్‌ ఉంది’’ అంటూ ఘాటుగా వి మర్శించారు. కానీ, పీవీ సర్కారు మైనారిటీలో పడ్డ ప్రతిసారి.. ఆయన కాపాడారు. దాంతో.. పీవీ సర్కారు గట్టెక్కింది. పీవీ ఎదుర్కొన్న మూ డు అవిశ్వాసాల్లోనూ అజిత్‌సింగ్‌ సర్కారును ముందుండి నిలబెట్టారు. అంతేకా దు.. జనతాదళ్‌ను పీవీ సర్కారులో భాగస్వామి అయ్యేందుకు కృషిచేశారు.  పీవీ సర్కారులో మంత్రిగా సేవలందించారు. పీవీ గద్దెదిగాక సొంత పార్టీని స్థాపించారు.


ఇటీవలి రైతు ఉద్యమంలో..

కంప్యూటర్‌ సైంటిస్ట్‌ అయినా.. అజిత్‌సింగ్‌ ముందు నుంచి రైతు పక్షపాతిగా పనిచేశారు. ఢిల్లీ శివార్లలో రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతిచ్చారు. రైతు ఉద్యమానికి మద్దతుగా తన సొంత నియోజకవర్గం బాగ్‌పట్‌లో మార్చి 1న నిరసన ప్రదర్శన నిర్వహించారు. 


కోవింద్‌, వెంకయ్య, మోదీ, కేసీఆర్‌ సంతాపం

అజిత్‌సింగ్‌ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ, యూపీ, ఢిల్లీ, తెలంగాణ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్‌, కేజ్రీవాల్‌, కేసీఆర్‌, హిమాచల్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు. 

Updated Date - 2021-05-07T10:17:38+05:30 IST