శ్రీశైలం రోడ్డు ప్రమాదం ఘటనలో ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2020-09-24T09:31:22+05:30 IST
శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిలో ఇద్దరు మృతి చెందారు.
గాయపడిన మరో ఏడుగురికి ఆస్పత్రుల్లో చికిత్స
మంగళ్హాట్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిలో ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్ మంగళ్హాట్ మగ్రాలో నివాసం ఉండే ధర్మేష్ సింగ్ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం శ్రీశైలం బయలుదేరారు. దాదాపు 20 మంది 3 వాహనాల్లో వెళ్లగా.. ముందు వెళ్లిన రెండు వాహనాలు శ్రీశైలం చేరుకోగా, మూడో వాహనం ఈగలపెంట దాటిన తరువాత ఘాట్ రోడ్డులోని మొదటి మలుపులో గోడను ఢీకొని లోయలో పడిపోయింది. ఈ వాహనంలో మొత్తం 10 మంది ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు లోయలో పడిన వాహనంలోని క్షతగాత్రులను బయటకు తీశారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన తోటికోడళ్లు రాజ్కుమారి బాయ్ (50), నీతూబాయ్ (42) మృతి చెందారు. గాయపడిన హేమలత(52), సుమలత(50), నమృత(42), ధార్మిక్(9), అనిల్ సింగ్(42), అశ్మిత్ సింగ్(10), ధర్మేష్ సింగ్ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాజ్కుమారీబాయ్, నీతూ బాయ్ల మృతదేహాలకు సాయంత్రం బంధువులు అంత్యక్రియలు పూర్తి చేశారు.