ఔటర్ రింగ్ రోడ్డెక్కిన కొద్ది నిమిషాలకే ఘోర ప్రమాదం
ABN , First Publish Date - 2021-03-15T13:12:54+05:30 IST
ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కిన కొద్ది నిమిషాలకే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
హైదరాబాద్/ఉప్పల్ : ఔటర్ రింగురోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉప్పల్ చిలుకానగర్లోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. గజ్వేల్ సమీపంలోని కిష్టాపూర్ గ్రామంలో విందుకు హాజరై తిరిగివస్తుండగా, ఆదివారం రాత్రి శామీర్పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కిన కొద్ది నిమిషాలకే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తోన్న కంటెయినర్ను మితిమీరిన వేగంతో వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న కరుణాకర్రెడ్డి, అతడి భార్య సరళ(40), వీరి బంధువైన సంధ్య(32) మరణించారు. కరుణాకర్రెడ్డి కిష్టాపూర్ కాగా, చిలుకానగర్లో బియ్యం దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ దంపతులకు పాప, బాబు ఉన్నారు. వీరితో పాటు కారులో ఉన్న బంధువు సంధ్య భర్త టీఆర్ఎస్ నాయకుడు ఈరెల్లి రవీందర్రెడ్డి. వీరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదంలో మృతి చెందిన సరళ, సంధ్య అక్కాచెల్లెళ్ల కుమార్తెలు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కంటెయినర్లో ఇరుక్కుపోవడంతో పోలీసులు క్రేన్ సహాయంతో బయటకు లాగారు. ఛిద్రమైన మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు మాత్రమే ఉన్నారు.