స్కాట్లాండ్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు యువకులు మృతి
ABN , First Publish Date - 2022-08-24T09:11:48+05:30 IST
స్కాట్లాండ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు యువకులు సహా మొత్తం ముగ్గురు మరణించారు.
మరొకరికి తీవ్ర గాయాలు
మృతుల్లో ఒకరిది హైదరాబాద్
మరొకరిది ఏపీలోని నెల్లూరు జిల్లా
చంపాపేట, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): స్కాట్లాండ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు యువకులు సహా మొత్తం ముగ్గురు మరణించారు. హైదరాబాద్కు చెందిన మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్కు చెందిన బాశెట్టి పవన్(22), చిలకమర్రి సాయివర్మ(24), బెంగళూరుకు చెందిన గిరీష్ సుబ్రమణ్యం(23) లండన్లోని లిసెస్టర్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతున్నారు. ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లాకు చెందిన మోడెపల్లి సుధాకర్(30) లిసెస్టర్లోనే ఉద్యోగం చేస్తున్నారు. ఈ నలుగురు కలిసి గత శుక్రవారం కారులో స్కాట్లాండ్ వెళ్లారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవన్, సుధాకర్, గిరీష్ మరణించారు. తీవ్రంగా గాయపడిన సాయివర్మ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పవన్ ఎనిమిది నెలల క్రితం లండన్ వెళ్లగా.. అతని తల్లిదండ్రులు బాశెట్టి జగదీష్, శ్యామల హైదరాబాద్, కర్మన్ఘాట్లోని లక్ష్మీనగర్లో నివాసముంటున్నారు. కొడుకు మరణం గురించి ఆదివారం సాయంత్రం తెలుసుకున్న వారు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, పవన్ మృతదేహాన్ని హైదరాబాద్కు రప్పించే అంశంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తమకు సాయం చేయాలని బాశెట్టి జగదీష్ వేడుకుంటున్నారు.