శబరిమల సమీపంలో ఘోర ప్రమాదం..
ABN , First Publish Date - 2021-12-09T19:58:58+05:30 IST
శబరిమల సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు.
కేరళ: శబరిమల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్నూలుకు చెందిన ఇద్దరు మృతి చెందారు. నగరంలోని బుధవారపేటకు చెందిన అయ్యప్ప స్వాములు టెంపోలో శబరిమలకు వెళ్లారు. శబరిమలకు 60 కి.మీ. దూరంలో టెంపో వాహనాన్ని నిలిపి.. టీ తాగుతున్నారు. అదే సమయంలో వెనుక నుంచి మరో వాహనం వచ్చి టెంపోను ఢీ కొట్టి.. భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో కర్నూలు నగరం నుంచి 11 మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు బయలుదేరారు. గురువారం ఉదయం 9:30 గంటల సమయంలో శబరిమలకు 60 కి.మీ. దూరంలో టెంపో వాహనాన్ని నిలిపి.. టీ తాగుతుండగా వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొనగా ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు మృతి చెందగా, మిగిలిన 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కేరళ పోలీసులు కర్నూలు పోలీసులకు తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.