కొండబిట్రగుంట రోడ్డు అధ్వానం!

ABN , First Publish Date - 2021-02-23T04:44:54+05:30 IST

కొండబిట్రగుంట బిలకూట క్షేత్రంలో వెలసిన ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే ప్రధాన రోడ్డు గుంతలు ఏర్పడి అధ్వానంగా ఉంది.

కొండబిట్రగుంట రోడ్డు అధ్వానం!
కొండబిట్రగుంట రోడ్డు గుంతల్లో చిరుజల్లులకే నిల్వ చేరిన నీరు

చిరుజల్లులకే గుంతల్లో చేరిన వర్షపు నీరు

నెల రోజుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

బిట్రగుంట, ఫిబ్రవరి 22: కొండబిట్రగుంట బిలకూట క్షేత్రంలో వెలసిన ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే ప్రధాన రోడ్డు గుంతలు ఏర్పడి అధ్వానంగా ఉంది. ఆదివారం కురిసిన కొద్దిపాటి వర్షానికి ఆ గుంతల్లో నీరు నిల్వ చేరి ప్రమాదభరితంగా మారింది. భారీ వర్షాలు, తుఫాన్లకు రోడ్డు ఇరువైపుల కోతకు గురికావడంతోపాటు రోడ్డు మధ్యలో లోతైన గోతులు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాగా నెల రోజుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రోడ్డు దుస్థితిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని మరమ్మతులు చేయించాలన్న విషయం అధికారులు పూర్తిగా విస్మరించారన్న ఆరోపణలున్నాయి, స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతి శనివారం వందలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తూ అవస్థలు పడుతున్నా పట్టించుకొనే నాథుడు లేడు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రోజూ వేల సంఖ్యలో భక్తులు ప్రయాణించే ఈ రోడ్డు దాదాపు అర కిలోమీటరు వరకు అటవీప్రాంతంలో ఉంది. మూడేళ్ల క్రితం కేంద్రం నిధులతో మంజూరైన రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ విషయమై స్థానిక ఎమ్యెల్యే ప్రతాప్‌ కుమార్‌రెడ్డి పలుమార్లు జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకు వెళ్ల్లినా ఎటువంటి ప్రయోజనం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకావం ఉంది.

Updated Date - 2021-02-23T04:44:54+05:30 IST