నాటి నాణ్యత.. నేడు వెలుగులోకి!
ABN , First Publish Date - 2021-09-18T04:53:07+05:30 IST
ఉదయగిరి పట్టణంలో ఐదు నెలల క్రితం ఒక కోటి రూపాయలు వెచ్చించి సుమారు 3 కి.మీ పొడవున సిమెంట్ రోడ్లు వేశారు.
రూ.కోటి రోడ్లకు కాలం చెల్లింది..!
ఐదు నెలలకే ధ్వంసమైన సీసీ రోడ్లు
ఉదయగిరి, సెప్టెంబరు 16 : ఉదయగిరి పట్టణంలో ఐదు నెలల క్రితం ఒక కోటి రూపాయలు వెచ్చించి సుమారు 3 కి.మీ పొడవున సిమెంట్ రోడ్లు వేశారు. అప్పట్లో పనులు దక్కించుకున్న అధికార పార్టీ నాయకులు రాత్రికి రాత్రే ఆగమేఘాలపై సీసీ రోడ్లు నిర్మించారు. అయితే, పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతో పది కాలలపాలు ఉండాల్సిన రోడ్లు ఐదు నెలలకే ఛిద్రమయ్యాయి. ఉదయగిరి మేజరు పంచాయతీ పరిధిలోని షబ్బీరు కాలనీ, బాలాజీ నగర్, యూనియన రోడ్డు, ప్రభుత్వ వైద్యశాల వెనుకవైపు, దేవలాలగడ్డ, ఏస్సీ కాలనీ తదితర చోట్ల ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో మూడు కి.మీ పొడవున సీసీ రోడ్లు వేశారు. ఇందుకుగాను సుమారు కోటి రూపాయలు మంజూరు చేస్తూ గ్రామ పంచాయతీనే నిధులు చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ నిధుల వినియోగానికి కొంత గడువు నిర్ధేశించింది. ఆ మేరకు పనులు దక్కించుకున్న అధికార పార్టీ నాయకులు రాత్రికి రాత్రే నాసిరకంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధుల్లో సుమారు రూ.30 లక్షలు బిల్లులు చెల్లించారు. మరో రూ.27 లక్షలు ఇటీవల 15వ ఆర్థిక సంఘ నిధుల్లో చెల్లించేందుకు అధికారులు ఎంబుక్లు సిద్ధం చేశారు. మిగిలిన బిల్లులు కూడా చెల్లించాలని అధికారులపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడి అధికమైంది. అయితే, ఐదు నెలలు తిరక్కముందే సీసీ రోడ్లు రాళ్లు తేలి ధ్వంసమవుతున్నాయి. అందులో ప్రధానంగా యూనియనరోడ్డు, షబ్బీరుకాలనీ, ప్రభుత్వ వైద్యశాల ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిని, కంకరలేచి గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. రోడ్డు నిర్మాణం సమయంలో నాణ్యత పాటించకపోవడం, క్యూరింగ్ పూర్తిగా చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు అంటున్నారు.
బిల్లులు నిలిపివేసాం
- వాణి, పంచాయతీరాజ్శాఖ ఏఈ
ఉదయగిరిలో నిర్మించిన సిమెంటు రోడ్లు దెబ్బతిన్న విషయం మా దృష్టికి వచ్చింది. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు ఆపేశాం. రోడ్ల మరమ్మతులు చేపట్టకపోతే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళుతాం.