Betting అప్పులు తీర్చుకునేందుకు.. స్నేహితురాలితో కలిసి చోరీ.. సోదరి ఇంట్లోనే..!
ABN , First Publish Date - 2021-09-15T13:10:58+05:30 IST
ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పెట్టి అప్పుల పాలయ్యాడు...
హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్ : ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పెట్టి అప్పుల పాలయ్యాడు. ఆర్థిక ఇబ్బందుల గురించి స్నేహితురాలికి చెప్పాడు. అనంతరం ఆమె సోదరి ఇంటినే ఇద్దరూ కలిసి కొల్లగొట్టారు. మహబూబ్నగర్జిల్లాకు చెందిన చింత రాజు రహ్మత్నగర్ సమీపంలోని కార్మికనగర్లో నివాసముంటున్నాడు. బీకాం కంప్యూటర్స్ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అదే బస్తీలో చిన్ననాటి స్నేహితురాలు జ్యోతి కూడా ఉంటోంది. రాజుకు ఆన్లైన్ బెట్టింగ్లు అలవాటు. అందులో ఉన్నదంతా పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు.
బాకీల నుంచి బయటపడే మార్గం చెప్పాలని జ్యోతిని కోరాడు. తన తల్లికి కిడ్నీ ఆపరేషన్ చేయించాలని నమ్మబలికాడు. జ్యోతి ఇంటి పక్కనే ఆమె సోదరి విజయ నివాసం ఉంటోంది. ఆమె కుటుంబ సభ్యులు ఊరు వెళ్లారు. ఇదే అదునుగా రాజు, జ్యోతి ఆమె ఇంట్లో చోరీ చేయాలని భావించారు. గత నెలలో ఇంట్లోకి వెళ్లి బీరువా తాళం పగలుకొట్టి బంగారు నగలు చోరీ చేసి పారిపోయారు. రాజు ఆ నగలను ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి రూ. నాలుగు లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బు కూడా ఆన్లైన్ బెట్టింగ్లో పోగొట్టాడు. ఊరి నుంచి వచ్చిన విజయ చోరీ విషయం తెలియడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆధారాలు పరిశీలించి రాజు, జ్యోతిని నిందితులుగా నిర్ధారించారు. రాజును అరెస్టు చేసిన పోలీసులు 25 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జ్యోతి పరారీలో ఉంది.