ఆ ఉప్పు తింటే ఏమైనా ఇబ్బందా?
ABN , First Publish Date - 2020-12-18T17:50:22+05:30 IST
రాక్ సాల్ట్ వినియోగం ఎక్కువైంది. ఇది అందరూ వాడొచ్చా? నిత్యం వాడితే ఏమైనా ఇబ్బందా
ఆంధ్రజ్యోతి(18-12-2020)
ప్రశ్న: రాక్ సాల్ట్ వినియోగం ఎక్కువైంది. ఇది అందరూ వాడొచ్చా? నిత్యం వాడితే ఏమైనా ఇబ్బందా?
- స్వరూపరాణి, మహబూబ్నగర్
డాక్టర్ సమాధానం: రాతి ఉప్పు ఎప్పటి నుండో వాడకంలో ఉంది. ఉత్పత్తిని బట్టి ఉప్పులో రకాలున్నాయి. సముద్రపు నీటి నుంచి తేసేది సముద్ర ఉప్పు. రాతి ఉప్పు గనుల నుండి లభిస్తుంది. ఏ ఉప్పులోనైనా ప్రధానంగా ఉండేది సోడియం క్లోరైడ్. చాలా తక్కువ మోతాదుల్లో పొటాషియం, కాల్షియం ఉంటాయి. రాతి ఉప్పును అందరూ వాడవచ్చు. రోజూ వాడడం వల్ల ఇబ్బందులేమీ ఉండవు. ఇందులో కూడ అయోడైజ్డ్ ఉప్పు, అయోడైజ్డ్ కాని ఉప్పు అని వేరుగా లభిస్తాయి. ఏ రకమైన ఉప్పైనా అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. గాయిటర్ సమస్య నివారణకు అయొడిన్ ఉన్న ఉప్పునే వినియోగించాలని ప్రభుత్వం తీర్మానించింది. అయితే సైంధవ లవణం లేదా పింక్ సాల్ట్లో మిగతా రకాల ఉప్పుతో పోలిస్తే ఖనిజాల శాతం ఎక్కువ, సోడియం శాతం తక్కువ. ఈ పింక్ సాల్ట్ వాడకం వల్ల పలు ఉపయోగాలున్నాయని చెబుతున్నప్పటికీ దానికి సరిపడా శాస్త్రీయ ఆధారాల్లేవు. రోజూ పింక్ సాల్ట్ వాడదలుచుకుంటే మితంగా తీసుకోవడమే మేలు. ఓ టీస్పూనుకు మించనీయవద్దు. ఈ సాల్ట్లో అయోడిన్ ఉండదనేది గుర్తుంచుకోవాలి.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)