ఆసీస్‌ తొలి రెండు టెస్టులకు రోహిత్‌, ఇషాంత్‌ దూరం

ABN , First Publish Date - 2020-11-25T09:53:26+05:30 IST

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీ్‌సను నిలబెట్టుకోవాలనుకుంటున్న భారత ప్రయత్నాలకు గట్టి దెబ్బే పడుతోంది. ఇప్పటికే కెప్టెన్‌ కోహ్లీ కేవలం ఒక టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉండగా..

ఆసీస్‌ తొలి రెండు  టెస్టులకు  రోహిత్‌, ఇషాంత్‌ దూరం

మిగతా మ్యాచ్‌లకూ సందేహమే!

శ్రేయాస్‌ అయ్యర్‌కు చాన్స్‌

సిరాజ్‌కు సదవకాశం


న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీ్‌సను నిలబెట్టుకోవాలనుకుంటున్న భారత ప్రయత్నాలకు గట్టి దెబ్బే పడుతోంది. ఇప్పటికే కెప్టెన్‌ కోహ్లీ కేవలం ఒక టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉండగా.. తాజాగా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ, వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ కూడా ఈ సిరీ్‌సలో ఆడేది సందేహంగా మారింది. ప్రస్తుతానికైతే తొలి రెండు టెస్టులకు వీరు దూరం కానున్నారు. ఎందుకంటే.. వీరు మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించడానికి మరో నెల రోజుల సమయం పడుతుందని సమాచారం. ఆ తర్వాతైనా మిగతా సిరీ్‌సల్లో పాల్గొంటారా? అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఐపీఎల్‌లో ఇషాంత్‌ పక్కటెముకల గాయంతో, రోహిత్‌ తొడ కండరాల గాయంతో బాధపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో కోలుకుంటున్నారు. డిసెంబరు 17 నుంచి ఆసీస్‌తో ఆరంభమయ్యే నాలుగు టెస్టుల సిరీ్‌సకు వీరు ఎంపికైన విషయం తెలిసిందే.


‘ఎన్‌సీఏ ఇచ్చిన నివేదిక ప్రకారం రోహిత్‌, ఇషాంత్‌ మ్యాచ్‌ ఫిట్‌ సాధించేందుకు కనీసం మూడు నుంచి నాలుగు వారాలు పడుతుంది. ఒకవేళ వీరు ఇప్పుడు వెళ్లినా అక్కడ 14రోజుల క్వారంటైన్‌ నిబంధనను పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఇతర ఆటగాళ్ల మాదిరి వీళ్లకు ప్రాక్టీస్‌కు కూడా అవకాశం ఉండదు. సాధన చేసుకోవాలంటే క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాల్సి ఉంటుంది’ అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. అన్నీ అనుకున్నట్టు సాగితే సరిగ్గా నెలరోజుల  తర్వాత వీరు ఆసీ్‌సకు వెళ్లినా క్వారంటైన్‌ ముగిసేసరికి మూడో టెస్టు (జనవరి 7 నుంచి) మొదలవుతుంది. దీంతో మిగిలిన ఒక్క టెస్టు మాత్రమే ఆడే అవకాశం ఉంటుంది. కానీ సరైన శిక్షణ లేకుండా వారు బరిలోకి దిగినా లాభం లేదనే ఆలోచనలో బోర్డు ఉన్నట్టు సమాచారం. 

Updated Date - 2020-11-25T09:53:26+05:30 IST