ఎందుకైందో అంత రచ్చ!
ABN , First Publish Date - 2020-11-22T09:15:20+05:30 IST
స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయంపై ఇటీవల ఎంతగానో రచ్చ జరిగింది. ఐపీఎల్ సమయంలో ఆస్ట్రేలియా టూర్ కోసం భారత జట్లను ప్రకటించగా..
గాయంపై రోహిత్ శర్మ
ఇప్పుడంతా బాగానే ఉంది
వేగంగా కోలుకుంటున్నా
బెంగళూరు: స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయంపై ఇటీవల ఎంతగానో రచ్చ జరిగింది. ఐపీఎల్ సమయంలో ఆస్ట్రేలియా టూర్ కోసం భారత జట్లను ప్రకటించగా.. గాయంతో బాధపడుతున్నందున రోహిత్ శర్మను పక్కనబెట్టారు. అయినా కూడా అతను ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగడం వివాదానికి దారితీసింది. ఇక చివరకు టెస్టులకు అతడిని ఎంపిక చేయడంతో ఆ వివాదం సద్దుమణిగింది. తాజాగా రోహిత్ జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ను మెరుగుపర్చుకునేందుకు కష్టపడుతున్నాడు. ఈ సందర్భంగా తన గాయంపై స్పందించిన రోహిత్.. వేగంగా కోలుకుంటున్నట్టు తెలిపాడు. ‘నా గాయం విషయంలో ఎందుకంత చర్చ జరిగిందో.. ప్రజలంతా ఏం మాట్లాడుకుం టున్నారో నాకు తెలీదు. లీగ్ దశలో గాయపడ్డాక తిరిగి బరిలోకి దిగుతానని మా జట్టుకు చెప్పా. ఒక్కసారి నా పరిస్థితిపై స్పష్టత వచ్చాక పరుగులు తీయడంపై దృష్టి సారించా. ఇక తాజా స్థితిపై ఎప్పటికప్పుడు బీసీసీఐ, ముంబై ఇండియన్స్తో చర్చిస్తున్నా. తొడ కండరాల గాయం నుంచైతే కోలుకున్నా. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంపైనే దృష్టి సారించా. అందుకే పరిమిత ఓవర్ల సిరీస్కు దూరమయ్యా. 25రోజుల్లో పూర్తిస్థాయిలో కోలుకుని టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే మ్యాచ్ ఫిట్తో ఉండాలనుకుంటున్నా. ఆ కారణంతోనే ఎన్సీఏలో ఉన్నా. కానీ నా విషయంలో ఎందుకింత దుమారం రేగిందో అర్థం కావడం లేదు’ అని రోహిత్ తెలిపాడు. మరోవైపు ముంబై జట్టు ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలవడం వెనుక కఠోర శ్రమ ఉందని, రాత్రికిరాత్రే తామీ స్థితికి రాలేదని రోహిత్ గుర్తుచేశాడు.