మా వ్యూహాలు పనిచేయలేదు: రోహిత్
ABN , First Publish Date - 2021-04-10T15:44:48+05:30 IST
మ్యాచ్లో తమ వ్యూహాలేవీ పనిచేయలేదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
టోర్నీ ఆరంభ మ్యాచ్లో గెలవడం అత్యంత కీలకమని, అయితే దురదృష్టవశాత్తూ ఆ మ్యాచ్లో తమ వ్యూహాలేవీ పనిచేయలేదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. చెన్నై వేదికగా శుక్రవారం జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో రోహిత్ సేన ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ గురించి రోహిత్ మాట్లాడాడు.
`ఆరంభ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనుకున్నాం. శక్తివంచన లేకుండా చివరి వరకు ప్రయత్నించాం. మేం అదనంగా మరో 20 పరుగులైనా చేయాల్సింది. ఏబీ, క్రిస్టియన్ భాగస్వామ్యాన్ని విడదీయడం కోసమే బుమ్రా, బౌల్ట్ను మధ్యలోనే బౌలింగ్కు దించాం. అయితే ఆ వ్యూహం పనిచేయలేదు. ఏదేమైనా అభిమానులకు మంచి వినోదాన్ని అందించాం. తటస్థ వేదికల్లో ఆడడం ఎవరికైనా అంత సులభం కాద`ని రోహిత్ పేర్కొన్నాడు.