ఐపీఎల్ జరుగుతుంది: రోహిత్‌శర్మ

ABN , First Publish Date - 2020-03-27T02:10:09+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరిగి తీరుతుందని టీమిండియా ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌శర్మ

ఐపీఎల్ జరుగుతుంది: రోహిత్‌శర్మ

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరిగి తీరుతుందని టీమిండియా ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌శర్మ ఆశాభావం వ్యక్తం చేశాడు. కోవిడ్-19 కారణంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు త్వరలో సద్దుమణుగుతాయని, ఆ తర్వాత ఏదో ఒక దశలో ఐపీఎల్ జరుగుతుందని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌తో రోహిత్‌శర్మ, అతడి కుమార్తె సమరియా కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఐపీఎల్ నిర్వహణపై ఉన్న అవకాశాల గురించి కెవిన్ ప్రశ్నించాడు. దీనికి రోహిత్ సమాధానం ఇస్తూ.. ఈ విషయంలో ఆశాభావంతోనే ఉన్నామని, పరిస్థితులు సద్దుమణిగి ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ఐపీఎల్ జరుగుతుందని పేర్కొన్నాడు.  


తమ జట్టులో క్రిస్‌లిన్, ట్రెంట్ బౌల్ట్, నాథన్ కల్టర్ నైల్ వంటి వారు ఉన్నారని రోహిత్ పేర్కొన్నాడు. వాంఖడే లాంటి పిచ్‌లపై బౌల్ట్ గొప్పగా రాణిస్తాడని, బంతిని బాగా స్వింగ్ చేయగలడని అన్నాడు. తాను దాని కోసమే ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. అతడికి బుమ్రా తోడైతే ఇక్క చెప్పక్కర్లేదని పేర్కొన్నాడు. 


దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్‌ను ఏప్రిల్ 15 వరకు బీసీసీఐ వాయిదా వేసింది. దేశంలో ఇప్పటి వరకు 650 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా  21 వేల మందికిపైగా మరణించారు. దీంతో ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు చాలా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఈ వైరస్ కారణంగా టోక్యో ఒలింపిక్స్ సహా పలు క్రీడా టోర్నీలు వాయిదాపడ్డాయి.   

Updated Date - 2020-03-27T02:10:09+05:30 IST