ఎదురుచూపులు..
ABN , First Publish Date - 2020-02-22T11:29:26+05:30 IST
ఎదురుచూపులు..
గ్రామ పంచాయతీల కో-ఆప్షన్ భర్తీ ఎప్పుడో?
ఆశావాహుల నిరీక్షణ
కులకచర్ల: పంచాయతీ ఎన్నికలు ముగిసి ఏడాది గడిచినా కో-ఆప్షన్ పదవులు భర్తీకి నోచుకోవడంలేదు. నూతనపంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం ఒక్కో పంచాయతీలో ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులను నియమించుకునేఅవకాశం కల్పించింది. అయినా కో-ఆప్షన్ సభ్యుల భర్తీలో జాప్యం జరుగుతుంది. ఆశావాహులు కో-ఆప్షన్ ఎన్నిక కోసం ఎదురు చూస్తున్నారు. మండలపరిధిలో 44 గ్రామ పంచాయతీలు ఉండగా ఒక్కో గ్రామ పంచాయతీకి ముగ్గురు చొప్పున కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. ఇందులో ఒకరు రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి, మరొకరు ఎన్ఆర్ఐ, ఇంక్కొక్కరు గ్రామ మహిళ సమాఖ్య అధ్యక్షురాలుకు అవకాశం కల్పించనున్నారు. దీంతో ఆయా గ్రామపంచాయతీల్లో కో-ఆప్షన్ ఎన్నిక కోసం ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. కో-ఆప్షన్ సభ్యులకు వార్డు సభ్యులతోసమానంగా హోదా ఉంటుంది. కానీ ఓటు హక్కు ఉండదు. అయినా పదవి హోదా దక్కుతుందనే ఆశ రేకెత్తిస్తుంది. మండల పరిధిలో అత్యధికంగా అధికార పార్టీ సర్పంచ్లు ఉన్నారు. ఆశవాహులైన టీఆర్ఎస్ కార్యకర్తలు స్థానిక సర్పంచ్కు అందుబాటులో ఉంటూనే పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డికి అప్పుడప్పుడు కలుస్తున్నారు. వరుసఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో కో-ఆప్షన్ సభ్యుల నియామకం కొంత జాప్యం కావడంతో ఎప్పుడు భర్తీ చేస్తారోనని గ్రామాల్లో చర్చ కొనసాగుతుంది.
ఎటువంటి ఆదేశాలు రాలేదు : సుందర్ ఇంచార్జి ఎంపీడీవో
పంచాయతీలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు వెలువరించిన తరువాత ఆ మార్గదర్శకాల ప్రకారం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక చేపడుతాం.