విడుదలైన అధికారిక ప్రకటన: RRB NTPC 2021 ఫలితాలు ఎప్పుడంటే..!
ABN , First Publish Date - 2021-12-05T17:39:05+05:30 IST
నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పరీక్ష రాసిన అభ్యర్థులకు..
ఇంటర్నెట్డెస్క్: నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పరీక్ష రాసిన అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. ఎన్టీపీసీ ప్రిలిమినరీ ఫలితాలను వచ్చే నెల 15న ప్రకటిస్తామని అధికారిక ప్రకటన విడుదల చేసింది. రైల్వే ఎన్టీపీసీ కింద దాదాపు 35 వేల పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్ఆర్బీ 2019లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సుమారు కోటి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2020 డిసెంబర్ 28 నుంచి 2021 జూలై 31 మధ్య దశల వారీగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ-1)ను నిర్వహించారు. తర్వాత కొన్ని రోజులకు ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. వాటిని సరిచేసి ఫైనల్కీని కూడా విడుదల చేశారు.
ఇదిలా ఉండగా, వచ్చే నెల 15న సీబీటీ-1 ఫలితాలను విడుదల చేసేందుకు ఆర్ఆర్బీ సిద్దమవుతోంది. ఈ ఫలితాలను అభ్యర్థులు తమ ప్రాంతీయ రైల్వే జోన్ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ జోన్ పరిధిలోని తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు www.rrbusenderabad.nic.in వెబ్సైట్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు. పరీక్షకు హాజరైన వారు రిజిస్టర్డ్ నంబర్/రోల్ నంబర్, పాస్వర్డ్/పుట్టిన తేదీ వంటి వివరాలతో లాగిన్ అయ్యి రిజల్ట్ చూసుకోవచ్చు. షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులకు సీబీటీ–2ను 2022, ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు నిర్వహిస్తామని ఆర్ఆర్బీ తెలిపింది. అభ్యర్థులు ఏవైనా వివరాల కోసం అధికారిక వెబ్సైట్లను మాత్రమే చూడాలని, ఫేక్న్యూస్లను నమ్మి మోసపోకండి అని సూచించింది.