‘ఆ’ ట్వీట్కు రూ. 18.30 కోట్లు...
ABN , First Publish Date - 2021-03-07T20:32:11+05:30 IST
‘ఆ’ ట్వీట్కు రూ. 18.30 కోట్లు...
శాన్ఫ్రాన్సిస్కో : 'జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విట్టర్' అంటూ 2006 మార్చి 21 న ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ చేసిన తొట్టతొలి ట్వీట్కు భారీ ధర పలికింది. ఈ ట్వీట్ ను అమ్మకానికి పెట్టారు.
దీనిని జాక్ డోర్సీ 'వాల్యుయబుల్స్ బై సెంట్' వెబ్సైట్లో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించారు. కాగా... ఈ ట్వీట్ కొనుగోలుకు లక్షల మంది మొగ్గు చూపడం విశేషం. బిడ్స్ కూడా పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి. అత్యధికంగా 2.5 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఔత్సాహికులు ముందుకు రావడం గమనార్హం. మన కరెన్సీలో ఇది రూ. 18.30 కోట్లు.
ఈ ట్వీట్ను కొనుగోలు చేసిన వారికి ట్విటర్ సీఈవో డిజిటల్గా వెరిఫై చేసి, సంతకం చేసిన ఓ ధ్రువపత్రాన్ని అందిస్తారు. ఆ పత్రంలో... ట్వీట్తో పాటు దానిని పోస్ట్ చేసిన సమయం తదితర వివరాలుంటాయి. ఈ ట్వీట్కు ఎంతోమంది లక్షల రూపాయలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు.