ఎకరానికి రూ.15 లక్షలు!

ABN , First Publish Date - 2020-09-13T09:29:31+05:30 IST

దళితులకు భూపంపిణీ చేసేందుకు ఎకరాకు రూ.2 లక్షల నుంచి 7 లక్షల వరకు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎకరానికి రూ.15 లక్షలు!

ఖరీదైన చోట రూ.20 లక్షల వరకు!

అయితేనే దళితులకు భూ పంపిణీ సాధ్యం

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు

భూముల ధరలు పెరిగినందునే మార్పులు 

రూ.7లక్షలకు ఎకరా అసాధ్యమన్న యంత్రాంగం


జిల్లాలో దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకం అటకెక్కింది. ప్రభుత్వం తరఫున భూమిని కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చెప్పినా ఎవరూ ఈ పథకం కోసం భూమిని ఇచ్చేందుకు ఆసక్తి  కనబర్చడం లేదు. సర్కారు నామామత్రంగా ధర చెల్లిస్తుండడంతో భూ పంపిణీ ముందుకు కదలడం లేదు. దీనిని గుర్తించిన అధికారులు ఎకరాకు రూ.15 నుంచి 20 లక్షల వరకు చెల్లించాలని ప్రతిపాదనలను పంపారు. దీనికి ఆమోదం లభిస్తే కొంత మందికైనా భూ పంపిణీ జరిగే అవకాశం ఉంది.


 జహీరాబాద్‌ ప్రాంతంలో నిమ్జ్‌ కోసం సేకరిస్తున్న భూములకు ఎకరాకు రూ.12-15 లక్షల వరకు చెల్లిస్తున్నారు. అయితే ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా దళితుల కోసం సేకరిస్తున్న భూములకు ఇదే విధంగా చెల్లిస్తే భూయజమానులు ముందుకు వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.


సంగారెడ్డి టౌన్‌, సెప్టెంబరు 12 : దళితులకు భూపంపిణీ చేసేందుకు ఎకరాకు రూ.2 లక్షల నుంచి 7 లక్షల వరకు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే భూముల ధరలు పెరగడంతో ఆ ధరకు భూములమ్మేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఈ పథకం జిల్లాలో అటకెక్కింది. దీన్ని పునరుద్ధరించాలంటే, దళితులకు లబ్ధి కలగాలంటే ఎకరాకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు చెల్లించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.


2019-20లో 150 ఎకరాలు, 2020-21లో 149 ఎకరాల భూమిని దళితులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధేశించినా ఆ మేరకు చేరుకోలేదు. ఇందుకు అవసరమైన భూమిని అధికారులైతే గుర్తించారు కానీ, ఆ ధరకు అంగీకరించని భూయజమానులు అమ్మేందుకు ససేమిరా అన్నారు. దీంతో ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు ఎకరాకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు చెల్లిస్తే భూయజమానులు తమ భూమిని అప్పగించేందుకు ముందుకు వస్తామంటున్నారని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.


భూసేకరణ ప్రచారానికి ఫ్లెక్సీలు

ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన మేరకు ఎకరాకు రూ.7లక్షల లోపు ధర చెల్లిస్తామని అధికారులు ప్రకటించినా స్పందన రాలేదు. దీంతో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబూరావు ఆధ్వర్యంలో జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయాలతో పాటు తహసీల్దార్‌, ఎంపీడీవో, వ్యవసాయ శాఖ, పీఏసీఎస్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద, రైతులు గుమిగూడే చోట పెద్దఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయినా అంత తక్కువ ధరకు ఎలా అమ్ముతామంటూ చాలా మంది అధికారులతో తేల్చి చెప్పారు. దీంతో ఈ పథకం నిలిచిపోయింది. తాజాగా అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే భూస్వాములు తమ భూములను అప్పగించేందుకు ముందుకు వచ్చే అవకాశమున్నది. 


ఇప్పటివరకు 170 మందికి..

భూపంపిణీ పథకం ద్వారా సంగారెడ్డి జిల్లాలో 2014-15 నుంచి 2018-19 వరకు 170 మంది దళితులకు రూ.15.91 కోట్లు వెచ్చించి 364 ఎకరాల భూములను కొనుగోలు చేసి పంపిణీ చేశారు. మొదట్లో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ పథకం కాలక్రమేణా నీరుగారింది. 2014-15లో 81 మందికి 196 ఎకరాలు, 2015-16లో 64 మందికి 109 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. 2016-17లో కేవలం 13 మందికి 34 ఎకరాలు, 2017-18లో 8 మందికి 16 ఎకరాలు ఇచ్చింది. 

Updated Date - 2020-09-13T09:29:31+05:30 IST