కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు
ABN , First Publish Date - 2020-08-05T09:16:22+05:30 IST
కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలకు ప్రభుత్వం రూ.15,000 ఇవ్వనుంది.
- జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదల
- ప్లాస్మా దాతలకు రూ.5 వేలు ప్రోత్సాహం
- ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్ సీఎస్ జవహర్రెడ్డి
అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలకు ప్రభుత్వం రూ.15,000 ఇవ్వనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి సోమవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డబ్బు మొత్తం బంధువులకు ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు అవసరమైన నిధులను ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయం జిల్లా కలెక్టర్లకు విడుదల చేయనుంది. అలాగే ప్లాస్మా దాతలకు రూ.5 వేల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.