డ్వాక్రా గ్రూపులకు ఇక రూ. 20 లక్షల వరకు రుణం... కొత్త రూల్స్ నోటిఫై...
ABN , First Publish Date - 2021-08-10T22:30:24+05:30 IST
ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రూల్స్ను నోటిఫై చేసింది. ఈ క్రమంలో... ఇకపై స్వయం సహాయక(డ్వాక్రా) గ్రూపులకు ఎటువంటి తనఖా లేకుండానే, అది కూడా రూ. 20 లక్షల వరకు రుణం లభించనుంది.
ముంబై : ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రూల్స్ను నోటిఫై చేసింది. ఈ క్రమంలో... ఇకపై స్వయం సహాయక(డ్వాక్రా) గ్రూపులకు ఎటువంటి తనఖా లేకుండానే, అది కూడా రూ. 20 లక్షల వరకు రుణం లభించనుంది. ఇప్పటివరకు ఈ పరిమితి రూ. 10 లక్షలే. ‘దీన్దయాళ్ అంత్యోదయ యోజన- నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్’లో భాగంగా ఆర్బీఐ ఈ వెసులుబాటు కల్పించింది. వివరాలిలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దీన్దయాల్ అంత్యోదయ యోజన పథకాన్నందిస్తోన్న విషయం తెలిసిందే. పేదరిక నిర్మూలన దీని ప్రధాన లక్ష్యం. ప్రత్యేకించి మహిళలకు అధిక ప్రాధాన్యం లభిస్తుంది.
ఈ క్రమంలో... మహిళలను కేంద్ర ప్రభుత్వం స్వయం సమృద్ధి దిశగా నడిపించనుంది. కాగా... ఆర్బీఐ కొత్త విధానం ప్రకారం... స్వయం సహాయక గ్రూపులకు రుణాలు మంజూరు చేసే సందర్భాల్లో బ్యాంకులు... డిపాజిట్లను పట్టుకోకూడదు. అంతేకాకుండా... వారి సేవింగ్స్ ఖాతాలపై ఎలాంటి ఆంక్షలూ విధించకూడదు. ఇక... రుణాల మంజూరు సమయంలో ఎలాంటి మార్జిన్ కూడా తీసుకోకూడదు. ఇక... రూ. 10 లక్షలలోపు రుణ మొత్తానికి క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ కవరేజ్ లభించనుండడం గమనార్హం.