స్విస్ బ్యాంకుల్లో రూ.20వేల కోట్లు!
ABN , First Publish Date - 2021-06-18T08:59:34+05:30 IST
స్విట్జర్లాండ్ బ్యాంకులపై భారతీయుల మోజు కొనసాగుతోంది. ఆ దేశ బ్యాంకుల షేర్లు, రుణ పత్రాల్లోనూ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో 2020 చివరికి ఆ దేశ
భారీగా పెరిగిన భారతీయుల నిధులు
న్యూఢిల్లీ/జురిచ్, జూన్ 17: స్విట్జర్లాండ్ బ్యాంకులపై భారతీయుల మోజు కొనసాగుతోంది. ఆ దేశ బ్యాంకుల షేర్లు, రుణ పత్రాల్లోనూ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో 2020 చివరికి ఆ దేశ బ్యాంకుల నుంచి భారతీయులు, భారత సంస్థలకు రావాల్సిన బకాయిలు 255 కోట్ల స్విస్ ఫ్రాంక్లకు (సుమారు రూ.20,700 కోట్లు) చేరాయి. స్విస్ నేషనల్ బ్యాంక్ గురువారం ఈ వివరాలు విడుదల చేసింది. గత 13 ఏళ్లలో స్విస్ బ్యాం కుల నుంచి భారతీయులకు రావాల్సిన చెల్లింపులు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. 2006లో ఈ మొత్తం గరిష్ఠంగా 650 కోట్ల స్విస్ ఫ్రాంక్స్కు చేరాయి. 2019తో పోల్చినా భారీగానే పెరిగింది. 2019 డిసెంబరు నాటికి స్విస్ బ్యాంకుల నుంచి రావాల్సిన బకాయిలు 89.9 కోట్ల స్విస్ ఫ్రాంక్స్ (సుమారు రూ.6,625 కోట్లు) మాత్రమే.
నల్లధనం కాదు..!
ఇదంతా స్విస్ బ్యాంకుల్లో మన బడా బాబులు, సంస్థలు దాచిన బ్లాక్ మనీ(నల్ల ధనం) అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ మొత్తం భారత్లోని స్విస్ బ్యాంకుల శాఖల ద్వారా అధికారికంగానే జమయ్యాయని స్విస్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. అనుమానాస్పద బ్యాంకు ఖాతాల సమాచార మార్పిడి కోసం 2018లో భారత్-స్విట్జర్లాండ్ మధ్య ఒప్పందం కుదిరింది. దాంతో మన నల్ల కుబేరులు పన్ను ల ఎగవేతకు స్వర్గధామాలైన కేమన్ ఐలాం డ్స్, మారిషస్ వంటి దేశాలకు మళ్లిస్తున్నారు.