విమానయాన రంగానికి రూ.27,000 కోట్ల నష్టం
ABN , First Publish Date - 2020-03-26T08:16:47+05:30 IST
కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా దేశంలో విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఒకవేళ విమాన సర్వీసులను జూన్ చివరి వరకు నిలిపివేస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం
సర్వీసుల నిలిపివేత కొనసాగితే అంతే.. కాపా ఇండియా అంచనా
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా దేశంలో విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఒకవేళ విమాన సర్వీసులను జూన్ చివరి వరకు నిలిపివేస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి త్రైమాసికంలో భారత విమానయాన రంగానికి 330-360 కోట్ల డాలర్ల (సుమారు రూ.25,000-27,000 కోట్లు) నష్టం రావొచ్చని ఏవియేషన్ కన్సల్టెన్సీ సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ (కాపా) ఇండియా అంచనా వేస్తోంది. ఏప్రిల్ 15 వరకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో విమానయాన రంగంపై తీవ్రమైన ప్రభావం పడనుంది.
కాపా ఇండియా అంచనా ప్రకా రం.. విమానయాన కంపెనీలు 175 కోట్ల డాలర్ల నష్టాన్ని, విమానాశ్రయాలు, కన్సెషనరీస్ 150-175 కోట్ల డాలర్ల నష్టాన్ని ప్రకటించవచ్చని పేర్కొంది. గ్రౌండ్ హ్యాండర్లు 8-9 కోట్ల డాలర్ల నష్టాలను చవిచూడవచ్చని తెలిపింది. ఇవన్నీ కలిపి విమానయాన రంగ నష్టాలు జూన్ త్రైమాసికంలో 330-360 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని కాపా అంచనా వేస్తోంది. జూన్ 30 వరకు విమాన సర్వీసులు నిలిపివేస్తే ఈ స్థాయిలో నష్టాలు ఉంటాయని లెక్కలు వేశారు. కాగా, ఎయిర్ ఇండియాకు రోజుకు రూ.30-35 కోట్ల నష్టం రావొచ్చని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.