రూ.4,736 కోట్ల మోసం
ABN , First Publish Date - 2021-01-10T07:43:30+05:30 IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలో కన్సార్షియంను రూ.4,736 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై హైదరాబాద్కు చెందిన
కోస్టల్ ప్రాజెక్ట్స్పై సీబీఐ కేసు
కంపెనీ చైర్మన్, ఎండీ, డైరెక్టర్లపైనా కేసు నమోదు
న్యూఢిల్లీ/హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలో కన్సార్షియంను రూ.4,736 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై హైదరాబాద్కు చెందిన నిర్మాణ రంగ కంపెనీ కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్పై సీబీఐ కేసు నమోదుచేసింది. ఈ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సబ్బినేని సురేంద్ర, మరో ఎండీ గారపాటి హరిహరరావు, డైరెక్టర్లు శ్రీధర్ చంద్రశేఖరన్ నివర్తి, శరద్ కుమార్, గ్యారెంటర్లు కె.రాములి, కె.అంజమ్మతోపాటు మరో కంపెనీ రవి కైలాస్ బిల్డర్స్కు చెందిన డైరెక్టర్లు రమేష్ పసుపులేటి, గోవిందకుమార్ ఇరానీలపై అభియోగాలు మోపింది.
హైదరాబాద్, విజయవాడలోని కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కార్యాలయాలు, నిందితుల ఇళ్లలో శనివారం సోదాలు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. పలు డాక్యుమెంట్లతో పాటు కీలకమైన ఆధారాలను సేకరించినట్లు పేర్కొంది. కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 2013 నుంచి 2018 మధ్య రుణం కోసం ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియాన్ని సంప్రదించింది. ఆ సమయంలో తప్పుడు ఖాతాలు, స్టేట్మెంట్లు, పనికిరాని బ్యాంక్ గ్యారంటీలు చూపడంతోపాటు. ప్రమోటర్ల వాటాల గురించి తప్పుడు సమాచారం ఇచ్చారు.
2013 అక్టోబరు 28 నుంచి ఈ కంపెనీ రుణం నిరర్ధక ఆస్తిగా మారిందని, గత ఏడాది ఫిబ్రవరిలో బ్యాంకులను మోసగించినట్టుగా నిర్ధారించారని సీబీఐ పేర్కొంది. సీబీఐకి ఎస్బీఐ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణనంతరం కోస్టల్ ప్రాజెక్ట్స్తోపాటు మరో 8 మందిపై కేసు నమోదయింది.