రూ.5,000 కోట్లతో కర్ణాటకలో బొమ్మల తయారీ క్లస్టర్
ABN , First Publish Date - 2021-01-10T07:08:20+05:30 IST
కర్ణాటకలోని కొప్పళలో రూ.5,000 కోట్ల పెట్టుబడితో బొమ్మల తయారీ క్లస్టర్ను ఏర్పాటు చేస్తు న్నారు.
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని కొప్పళలో రూ.5,000 కోట్ల పెట్టుబడితో బొమ్మల తయారీ క్లస్టర్ను ఏర్పాటు చేస్తు న్నారు. ఈ క్లస్టర్కు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప శనివారం భూమిపూజ చేశారు. ఆసియాలోనే అతిపెద్ద బొమ్మల ఉత్పాదక కేంద్రం రాష్ట్రంలో ఏర్పాటు కానుందని వెల్లడించారు. కొప్పళ జిల్లా కుకనూరు తాలూకా బానాపురలో ఏకాస్ కంపెనీ నిర్మిస్తున్న క్లస్టర్లో 400 ఎకరాల విస్తీర్ణంలో ఈ బొమ్మల తయారీ కేంద్రం ఏర్పాటవుతోందని తెలిపారు.
క్లస్టర్ ద్వారా 40 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, దేశ విదేశాలకు చెందిన బొమ్మల తయారీకి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఎకాస్ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద మెళ్లిగేరి మాట్లాడుతూ.. ఈ క్లస్టర్ ద్వారా 18 శాతం ఆటబొమ్మలు ఉత్పత్తి అవుతాయని, 2023 నాటికి రూ.2,300 కోట్ల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
వాణిజ్య నగరం హుబ్బళికి సమీపంలో ఉండటం మరింత అనుకూల పరిణామమని తెలిపారు. బొమ్మల తయారీ ద్వారా లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.