రూ.6,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2021-09-17T08:00:00+05:30 IST

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకంపై ఏసీ, ఎల్‌ఈడీ లైట్ల తయారీ సంస్థ లు ఆసక్తి చూపిస్తున్నాయి.

రూ.6,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు

పీఎల్‌ఐ పథకంపై ఏసీ, ఎల్‌ఈడీ కంపెనీల ఆసక్తి 

న్యూఢిల్లీ: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకంపై ఏసీ, ఎల్‌ఈడీ లైట్ల తయారీ సంస్థ లు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ పథకం కింద రూ.6,000 కోట్ల అంచనాతో దేశంలో తమ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు డైకిన్‌, హిటాచీ, పానాసోనిక్‌, సిస్కా వంటి 52 కంపెనీలు ముందుకొచ్చాయి. నవంబరు 15లోగా ఈ కంపెనీలను ఎంపిక చేస్తామని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) అదనపు కార్యదర్శి అనిల్‌ అగర్వాల్‌ చెప్పారు. ఈ పథకం కింద దేశంలో విద్యుత్‌, ఎలకా్ట్రనిక్‌ వినియోగ పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏప్రిల్‌లో రూ.6,238 కోట్లు కేటాయించింది. ప్రభుత్వానికి అందిన రూ.6,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనల్లో రూ.5,000 కోట్ల విలువైన ప్రతిపాదనలు ఏసీల తయారీ కంపెనీల నుంచి అందినట్టు ఫిక్కీ ఎలకా్ట్రనిక్స్‌  మాన్యుఫాక్చరింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మనీశ్‌ శర్మ చెప్పారు.

 

ఈవీలకూ ఊతం 

పీఎల్‌ఐ పథకం విద్యుత్‌ వాహన రంగానికీ మేలు చేస్తుందని ఆ రంగానికి ప్రాతినిధ్యం వహించే ఎస్‌ఎంఈవీ పేర్కొంది. ఆటోమొబైల్‌ వాహనాలు, విడి భాగాలు, డ్రోన్ల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పీఎల్‌ఐ పథకం కింద రూ.26,058 కోట్లు కేటాయించింది. దీంతో వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలోకి కొత్తగా రూ.42,500 కోట్ల పెట్టుబడులు, రూ.2.3 లక్షల కోట్ల అదనపు ఉత్పత్తి, 7.5 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని ఎస్‌ఎంఈవీ డైరెక్టర్‌ జనరల్‌ సోహిందర్‌ గిల్‌ తెలిపారు. కాగా ఆటోమొబైల్‌ రంగం కోసం ప్రకటించిన పీఎల్‌పీ రాయితీలు, పోత్రాహకాలు అమెరికా ఆటోమొబైల్‌ దిగ్గజం ‘టెస్లా’ను ఆకర్షించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.  

Updated Date - 2021-09-17T08:00:00+05:30 IST