దారుణ హత్యకు గురైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త

ABN , First Publish Date - 2021-11-15T23:57:45+05:30 IST

కేరళలోని కన్నూరు జిల్లా మాంబరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్త ఒకరు

దారుణ హత్యకు గురైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త

పాలక్కాడు: కేరళలోని కన్నూరు జిల్లా మాంబరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్త ఒకరు సోమవారంనాడు దారుణ హత్యకు గురయ్యారు. మృతుని ఎస్.సంజిత్‌(27)గా గుర్తించారు.  సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సంజిత్‌ను అతని భార్య కళ్లముందే నరికి చంపారని, వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ తీవ్ర గాయాలతో కన్నుమూశాడని పోలీసులు చెప్పారు. ఈ హత్య వెనుక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) కార్యకర్తల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పరారైన నిందుతుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


కాగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్త నరికివేత ఘటనను బీజేపీ ఖండించింది. సంజిత్‌ను ఎల్లప్పుల్లి నుంచి వచ్చిన నిందితులు వాహనంలో అనుసరించారని, సంజిత్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి అతను కింద పడగానే భార్య కళ్లముందే నరికి చంపారని బీజేపీ ఆరోపించింది. ఇది వ్యూహం ప్రకారం జరిగిన హత్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేందర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడటంలో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. భార్యతో సహా వాహనంపై వెళ్తుండగా సంజిత్‌ను అడ్డుకుని దారుణంగా చంపారని, ఇది పథకం ప్రకారం జరిగిన హత్యేనని పాలక్కాడ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కేఎం హరిదాస్ చెప్పారు. రాష్ట్రంలో అధికార పార్టీకి ఎస్‌డీపీఐ  దన్నుగా ఉందని ఆయన ఆరోపించారు.

Updated Date - 2021-11-15T23:57:45+05:30 IST