RSS chief : సీఏఏ, ఎన్నార్సీతో భారతీయ ముస్లింలకు నష్టం లేదు

ABN , First Publish Date - 2021-07-21T21:12:41+05:30 IST

ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమానత్వం లాంటి వాటిని ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన ఖర్మ భారతదేశానికి

RSS chief : సీఏఏ, ఎన్నార్సీతో భారతీయ ముస్లింలకు నష్టం లేదు

గౌహతి : ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమానత్వం లాంటి వాటిని ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన ఖర్మ భారతదేశానికి లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ రావ్ భాగవత్ తేల్చి చెప్పారు. ఇవన్నీ భారత్ సంప్రదాయంలోనే, రక్తంలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. సనాతనంగా వీటన్నింటినీ భారతదేశం ఆచరిస్తూనే వస్తోందని, ఇతర దేశాల చూసి నేర్చుకోవాల్సిన అవసరమే లేదని పేర్కొన్నారు. సీఏఏ గానీ, ఎన్నార్సీ గానీ ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవర్ని దృష్టిలో పెట్టుకొనో వీటిని రూపొందించలేదన్నారు. సీఏఏ, ఎన్నార్సీకి సంబంధించిన ఓ పుస్తకం ఆవిష్కరణలో మోహన్ రావ్ భాగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఏఏ వల్ల భారతీయ ముస్లింలకు ఎలాంటి నష్టమూ వాటిల్లదని, దేశ విభజన తర్వాత మైనారిటీలకు ఎలాంటి నష్టమూ వాటిల్లకుండా తాము చూసుకుంటామని అప్పట్లోనే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీకి తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, పాకిస్తాన్ మాత్రం ఆ హామీకి కట్టుబడి లేదని, తుంగలో తొక్కిందని తీవ్రంగా మండిపడ్డారు. సీఏఏ, ఎన్నార్సీ వల్ల భారతీయ ముస్లింలకు ఎలాంటి నష్టమూ లేదని, కేవలం తమ తమ స్వార్థ రాజకీయాల కోసం వీటికి వేరే రంగు పులిమారని మండిపడ్డారు. పొరుగు దేశాలలో హింసకు గురవుతున్న మైనారిటీలకు పౌరసత్వ సవరణ చట్టం రక్షణ కల్పిస్తుందని మోహన భాగవత్ పేర్కొన్నారు.  

Updated Date - 2021-07-21T21:12:41+05:30 IST