నగరానికి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు
ABN , First Publish Date - 2021-01-16T06:59:27+05:30 IST
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లి నగరానికి వస్తున్న ప్రయాణికుల కోసం గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపనుంది.
సీబీఎస్, జేబీఎ్సలో ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ
రద్దీ ప్రాంతాల్లో సూపర్ వైజర్లు
హైదరాబాద్ సిటీ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లి నగరానికి వస్తున్న ప్రయాణికుల కోసం గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపనుంది. సీబీఎస్, జేబీఎ్సతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో దిగిన ప్రయాణికులు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆయా ప్రాంతాలకు సిటీ సర్వీసులు నడుపుతామన్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేకంగా సూపర్వైజర్లను నియమిస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. రైళ్లలో వచ్చే ప్రయాణికులు బస్సుల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్ నుంచి గ్రేటర్ వ్యాప్తంగా రెగ్యులర్ సిటీ సర్వీసులతోపాటు వందకుపైగా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని తెలిపారు.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు
సంక్రాంతి సందర్భంగా ఏపీ, తెలంగాణ జిల్లాలకు టీఎస్ ఆర్టీసీ 2,500 పైగా ప్రత్యేక సర్వీసులు నడిపింది. అదే తరహాలో జిల్లాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఆయా జిల్లాల నుంచి ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.