లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ABN , First Publish Date - 2022-04-16T08:56:04+05:30 IST
అతి వేగం.. రోడ్డు ప్రమాదానికి కారణమైంది. ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు..
20 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
మెండోర / నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 15: అతి వేగం.. రోడ్డు ప్రమాదానికి కారణమైంది. ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. అదే లారీని ఢీకొంది. నిజామాబాద్-నిర్మల్ జిల్లాల సరిహద్దులో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. టీఎస్ ఆర్టీసీకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి నిర్మల్కు 39 మంది ప్రయాణికులతో గురువారం అర్ధరాత్రి బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిజామాబాద్ జిల్లా మెండోర మండలం వద్ద ఓవర్టేక్ చేసే క్రమంలో ముందు వెళుతున్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా 20 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు.. క్షతగాత్రులను నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు.