అంతా గ్రీన్జోనే..
ABN , First Publish Date - 2020-05-19T09:37:50+05:30 IST
రిక్షా కాలనీ మినహా వికారాబాద్ జిల్లా మొత్తం గ్రీన్జోన్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో కట్టడి ప్రాంతంగా కొనసాగుతున్న వికారాబాద్
వికారాబాద్లోని రిక్షా కాలనీలో కట్టడి తప్ప
తెరుచుకోనున్న అన్ని దుకాణాలు
నేటి నుంచి రోడ్లపైకి ఆర్టీసీ బస్సులు, ఆటోలు
(ఆంధ్రజ్యోతి, వికారాబాద్) : రిక్షా కాలనీ మినహా వికారాబాద్ జిల్లా మొత్తం గ్రీన్జోన్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో కట్టడి ప్రాంతంగా కొనసాగుతున్న వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని రిక్షా కాలనీ తప్ప గ్రీన్ జోన్గా ప్రకటించారు. కేవలం 15 రోజుల వ్యవధిలో జిల్లాలో 38 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లాను కేంద్ర ప్రభుత్వం రెడ్జోన్గా ప్రకటించింది. కరోనాను నియంత్రించేందుకు పాజిటివ్ కేసులు నమోదైన ఎనిమిది ప్రాంతాలను కట్టడి జోన్లుగా ప్రకటించి నిషేధాజ్ఞలు విధించారు. జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు ఏప్రిల్ 4న వికారాబాద్ రాజీవ్నగర్ కాలనీలో నమోదు కాగా, చివరి కోవిడ్ కేసు అదేనెల 19న రిక్షా కాలనీలో నమోదైంది.
చివరి పాజిటివ్ కేసు నమోదైన తరువాత 29 రోజుల నుంచి జిల్లాలో కొత్త కేసులు నమోదు కాలేదు. జిల్లాలో 38 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో వికారాబాద్కు చెందిన ఓ వృద్ధ్దుడు మృతి చెందాడు. మిగిలిన 37 మందిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఏప్రిల్ 21న తొలి కరోనా పాజిటివ్ వ్యక్తి ఆరోగ్యంతో గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా, చివరి వ్యక్తి ఈనెల 14న డిశ్చార్జి అయ్యారు. నెల రోజులుగా జిల్లాలో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో గ్రీన్జోన్గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. జోన్లను నిర్ణయించే అధికారం కేంద్రం రాష్ట్రాలకు కట్టబెట్టడంతో కట్టడి ప్రాంతం కొనసాగుతున్న రిక్షా కాలనీ మినహా మిగతా జిల్లాను రెడ్జోన్ నుంచి గ్రీన్ జోన్లోకి మారుస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
గ్రీన్జోన్లోకి మారిన జిల్లాలో భౌతిక దూరం, మాస్కులు ధరించడం, వాహనాల్లో నిర్దేశించిన సంఖ్యలో ప్రయాణించడం వంటి నిబంధనలు మినహా మిగతా ఆంక్షల నుంచి మినహాయించనున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు, మద్యం, భవన నిర్మాణ, వ్యవసాయ సంబంధమైన వ్యాపారాలు మినహా మిగతా వ్యాపారాలపై కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తేశారు. జిల్లా గ్రీన్జోన్లోకి మారడంతో మంగళవారం నుంచి అన్ని రకాల వ్యాపారాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేట్ వాహనాలు కొన్ని షరతులతో నేటి నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి.