రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు

ABN , First Publish Date - 2020-05-19T10:08:37+05:30 IST

లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు మంగళ వారం నుంచి రయ్‌ రయ్‌మంటూ రోడ్డెక్కనున్నాయి.

రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు

58 రోజులుగా డిపోలకే పరిమితం

జిల్లాలో ఆర్టీసీకి రూ. 17.40 కోట్ల నష్టం

నిబంధనల మేరకే నేటి నుంచి ప్రయాణం


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు మంగళ వారం నుంచి రయ్‌ రయ్‌మంటూ రోడ్డెక్కనున్నాయి. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి డిపోల్లో మంగళవారం నుం చి ఆర్టీసీ బస్సులు నడుపనున్నారు. జగిత్యాల జిల్లాలోని మూడు డిపోల్లో 268 బస్సులు ఉన్నాయి. ఇందులో డ్రైవర్లు, కండక్టర్లు కలిసి 859 మంది పని చేస్తున్నారు. జిల్లాలో రోజుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల మేరకు ఆదాయం వస్తుంది. మార్చి 22న విధించిన జనతాకర్ఫ్యూ నుంచి మే 18 వరకు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ సంస్థకు దాదాపు రూ.17.40 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. ఒక్కో బస్సులో సగం మేరకే ప్రయాణికులు ఉండాలని ఆదేశాలు ఉండటంతో సగం మందికే చోటు లభించనుంది.


ఇదిలా ఉంటే జగిత్యాల, మెట్‌పల్లి బస్టాండ్‌లలో ఇన్నాళ్లు కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేశారు. జగిత్యాల బస్టాండ్‌లో ఉన్న కూరగాయల మార్కెట్‌ను అంగడి బజార్‌కు తరలించనున్నారు. మెట్‌పల్లి బస్టాండ్‌లో ఉన్న కూరగాయల మార్కెట్‌ను పాత కూరగాయల మార్కెట్‌కు తరలిస్తారు. ఇదిలా ఉంటే జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు పూర్తి స్థాయిలో పని చేయనున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బస్సులకు అనుమతి ఉండదు. ఆటో, ట్యాక్సీలు తిప్పుకునేందుకు అనుమతులు ఇవ్వగా, కేవలం ఒక్కో ట్యాక్సీలో ము గ్గురికి మాత్రమే అనుమతి ఉంటుంది.

Updated Date - 2020-05-19T10:08:37+05:30 IST