ఆర్టీసీలో కల్లోలం

ABN , First Publish Date - 2020-08-05T09:12:33+05:30 IST

ప్రజా రవాణా సంస్థ సిబ్బందిని కరోనా కబలిస్తోంది. ఆగస్టు 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1187 మంది కొవిడ్‌ బారిన పడినట్లు ఆర్టీసీ అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఆర్టీసీలో కల్లోలం

  • 1187 మందికి వైరస్‌.. 
  • 18 మంది మృతి

అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ప్రజా రవాణా సంస్థ సిబ్బందిని కరోనా కబలిస్తోంది.  ఆగస్టు 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1187 మంది కొవిడ్‌ బారిన పడినట్లు ఆర్టీసీ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ 18 మంది మృతి చెందినట్లు ఉన్నతాధికారులు చెబుతుండగా ఆ సంఖ్య 20 దాటిందని కార్మికులు అంటున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజా రవాణా ప్రారంభం కాగానే ఈయూ, ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కార్మిక సంఘాలు యాజమాన్యానికి, ప్రభుత్వానికి కొన్ని వినతులిచ్చాయి. సిబ్బందికి కొవిడ్‌ వస్తే మెరుగైన వైద్యం అందించాలని, ఎవరైనా మరణిస్తే 50లక్షల బీమా వర్తింపజేయాలని కోరాయి. అందుకు అనుగుణంగా జూలై 15న ఆర్టీసీ యాజమాన్యం అన్ని డిపోల మేనేజర్లు, ఆర్‌ఎంలు, ఈడీలకు సర్క్యులర్‌ జారీ చేసింది. పీటీడీ సిబ్బంది ఎవరికి కరోనా సోకినా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపిక చేసిన అన్ని రెఫరల్‌ ఆసుపత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించాలని ఆదేశించింది.


సాధారణ ఐసోలేషన్‌కు మూడున్నర వేల రూపాయలు, వెంటిలేటర్‌ వైద్యానికి పదిన్నర వేలు నిర్ణయించి ఆ నిధులు డ్రా చేసి ఖర్చు చేసే అధికారం డిపో మేనేజర్లకు ఇచ్చింది. కానీ రాష్ట్రంలోని ఏ రెఫరల్‌ ఆసుపత్రికి వెళ్లినా ‘బెడ్లు లేవు’ అనే సమాధానం వస్తోంది. పోనీ క్వారంటైన్‌ కేంద్రాలకు వెళదామంటే ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకోండని సూచిస్తున్నారు. అలాగని ఇంటికి వద్దామంటే అద్దె ఇళ్ల యజమానులు అడ్డుకొంటున్నారు. కాగా, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఒకటి రెండు వైద్యశాలలు ఆర్టీసీకి ఉన్నాయి. వాటినే కొవిడ్‌ కేంద్రాలుగా మార్చి వైద్యం అందించాలని సిబ్బంది కోరుతున్నారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల బీమా కూడా అడుగుతున్నారు. 

Updated Date - 2020-08-05T09:12:33+05:30 IST