నా వాడైతే సరి.. ఇచ్చేద్దాం సిరి.. 400 మంది ఉద్యోగులకు జీతంలో నష్టం

ABN , First Publish Date - 2020-07-09T21:05:23+05:30 IST

నా వాడైతే సరి.. ఇచ్చేద్దాం సిరి. అన్న తీరుగా భద్రాచలం ఆర్టీసీ డిపో అధికారులు వ్యవహరిస్తున్నట్లు ఉ ద్యోగులు వాపోతున్నారు. తన వారికైతే ఒక న్యాయం, మరొకరికి అయితే అన్యాయం అనే రీతిలో డిపోలోని కొంత మంది

నా వాడైతే సరి.. ఇచ్చేద్దాం సిరి.. 400 మంది ఉద్యోగులకు జీతంలో నష్టం

ఫేర్‌ చార్టులో సంతకాలు సేకరించని అధికారులు

కరోనా సమయంలో భద్రాచలం ఆర్టీసీ డిపో ఉద్యోగుల ఇక్కట్లు


భద్రాచలం (ఆంధ్రజ్యోతి): నా వాడైతే సరి.. ఇచ్చేద్దాం సిరి. అన్న తీరుగా భద్రాచలం ఆర్టీసీ డిపో అధికారులు వ్యవహరిస్తున్నట్లు ఉ ద్యోగులు వాపోతున్నారు. తన వారికైతే ఒక న్యాయం, మరొకరికి అయితే అన్యాయం అనే రీతిలో డిపోలోని కొంత మంది అధికారులు వ్యవహరించిన తీరుతో 483 మంది ఉద్యోగుల్లో 400 మందికి జీతంలో నష్టం వాటిల్లింది.విధుల నిర్వహణ సమయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఫేర్‌ చార్టులో సంతకాలు సేకరించకపోవడం.... ఆ తప్పిదం తమపై వస్తుందనే భయంతో ఉద్యోగులకు గైర్హా జరైనట్లు రికార్డు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మే 19 నుంచి బస్సుల రాకపోకలు పునః ప్రారంభం కాగా నాటి నుంచి జూన్‌ నెల వరకు సంబంధించిన గైర్హాజరీల గురించి తమకు న్యాయం చేయాలని అధికారులను ఆశ్రయించినా వారికి న్యాయం జరగలేదని తెలుస్తోంది. దీంతో కొంత మంది అధికారుల కారణంగా డిపోలో పని చేస్తున్న ఉద్యోగుల్లో అధిక శాతం మందికి వివిధ కటింగ్‌లు పోను నెలకు రూ.50 జీతం నుంచి రూ.2000 వరకు అతి కనిష్ఠస్థాయిలో జీతం వచ్చిందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు.


ఈ విషయమై తాము అధికారులను ఆశ్రయించి గైర్హాజరీలుగా పేర్కొన్న రోజులను సీఎల్‌తో భర్తీ చేయాలని విన్నవించినా సానుకూలంగా స్పందించకపోవడంతో తాము అత్యంత కనిష్ఠస్థాయిలో జీతాలను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ డిపోలో లేని విధంగా తాము జీతాలను కోల్పోయామని వారు కన్నీటిపర్యంతమవుతున్నారు. వాస్తవానికి కరోనా నేపథ్యంలో అతి తక్కువ సర్వీసులు డిపో నుంచి నడుపుతుండటంతో విధులకు వెళ్లని వారిని ఫేర్‌ చార్టులో సంతకాలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కేవలం రెండు రోజుల పాటు ఆవిధంగా సంతకాలు సేకరించి అనంతరం ఆ ఊసే మరిచారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. చివరకు జీతాల సమయం నాటికి విధులకు గైర్హాజరైనట్లు పేర్కొంటుండటంతో తమకు ఆర్థికంగా సమస్యలు తలెత్తుతున్నాయని వారు వాపోతున్నారు. 


ఐదు రోజులు డ్యూటీ చేసిన వారికి 20 రోజులు సెలవులు ఇస్తూ, 20 మస్టర్లు చేసిన వారికి ఆరు రోజులు గైర్హాజరు వేస్తూ అధికారులు తమ వారైతే ఒకలాగ పరాయి వారైతే మరోలా వ్యవహరించారని పలువురు ఉద్యోగులు బహిరంగంగానే విమర్శస్తున్నారు. ఈ విషయంపై భద్రాచలం ఆర్టీసీ డీఎం శ్రీనివాసును ఆంధ్రజ్యోతి సంప్ర దించగా ఈ సమస్య తన దృష్టికి వచ్చిందని సాంకేతికపరమైన లోపాల కారణంగా ఈ నెల జీతాల్లో కోతలు విధించామని తెలిపారు. డిపో పరిధిలో కొంత మంది అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరించారనే ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని అన్నారు. డిపో పరిధిలోని ఉద్యోగులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.

Updated Date - 2020-07-09T21:05:23+05:30 IST