ఆర్టీసీ దసరా ఆదాయం ఢమాల్‌

ABN , First Publish Date - 2021-10-18T05:30:00+05:30 IST

రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 18: జిల్లా ఆర్టీసీ దసరా ఆదాయం గణనీయంగా పడిపోయింది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఈ ఏడాది హైదరాబాద్‌ నుంచి ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా తగ్గిపోవడంతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండిపడింది. ప్రతీఏటా జిల్లాకు

ఆర్టీసీ దసరా ఆదాయం ఢమాల్‌

రూ.50 లక్షలకు పడిపోయిన వైనం

గణనీయంగా తగ్గిన హైదరాబాద్‌ ప్రయాణికులు

విజయవాడ సర్వీసులతో కొంత వరకు లోటు భర్తీ

రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 18: జిల్లా ఆర్టీసీ దసరా ఆదాయం గణనీయంగా పడిపోయింది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఈ ఏడాది హైదరాబాద్‌ నుంచి ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా తగ్గిపోవడంతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండిపడింది. ప్రతీఏటా జిల్లాకు రూ.1.40 కోట్ల వరకు వచ్చే దసరా ఆదాయం ఈ ఏడాది రూ.50 లక్షలకు పడిపోవడం అధికారవర్గాలను విస్మయపరుస్తోంది. గత ఏడాది కొవిడ్‌ కారణంగా ఆర్టీసీ బస్సులు నడపలేకపోవడంతో జిల్లా ఆర్టీసీ మొత్తంఆదాయాన్ని కోల్పోయింది. ఈ ఏడాది పరిస్థితులు కాస్త అనుకూలించడంతో హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం రూట్లలో పూర్తిస్థాయిలో బస్సులు నడపాలని భావించినా ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో భంగపాటు తప్పలేదు. ఈ ఏడాది హైదరాబాద్‌ రూటులో కేవలం రూ.10-12 లక్షలకు మించి ఆదాయం రాబట్టలేకపోయారు. కొవిడ్‌కు ముందు 2019లో జిల్లా నుంచి 170 బస్సులు ఆపరేట్‌ చేసిన అధికారులకు ఈ ఏడాది మాత్రం ఆశించిన ఫలితాలు రాకపోవడం గమనార్హం. అయితే జిల్లాలోని 9 డిపోల నుంచి విజయవాడకు పెద్ద సంఖ్యలోనే బస్సులు నడిపినట్టు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. విజయవాడకు సాధారణ షెడ్యూల్‌ సర్వీసులతో పాటు 85 స్పెషల్‌ బస్సులు నడపగలిగారు. విజయవాడ, విశాఖపట్నం రూట్లలో బస్సులను ఆశించిన స్థాయిలో తిప్పగలిగామని, హైదరాబాద్‌ రూటు నిరాశపర్చిందని ఆర్టీసీ రాజ మహేంద్రవరం రీజనల్‌ మేనేజరు (ఆర్‌ఎం) నాగేశ్వరరావు తెలిపారు. ‘ఏ కారణంతోనే ఈ ఏడాది హైదరాబాద్‌ మూమెంట్‌ బాగా తగ్గింది... ఈ లోటును విజయవాడ వెళ్లే భవానీ భక్తులతో కొంత వరకు భర్తీ చేశాము. భవానీల కోసం కొన్ని స్పెషల్‌ బస్సులు కూడా నడిపాం. విశాఖపట్నం రూటులోనూ ట్రాఫిక్‌ బాగుంది’ అని ఆర్‌ఎం వివరించారు. 

Updated Date - 2021-10-18T05:30:00+05:30 IST